మధ్య ప్రదేశ్ సంక్షోభం ముగియక ముందే కాంగ్రెస్లో మరో కల్లోలం!
ABN , First Publish Date - 2020-03-15T20:38:29+05:30 IST
22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్య ప్రదేశ్లో నెలకొన్న సంక్షోభం నుంచి గట్టెక్కకుండానే కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్రంలో ...
![మధ్య ప్రదేశ్ సంక్షోభం ముగియక ముందే కాంగ్రెస్లో మరో కల్లోలం!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020031502580511/03152020150810n65.jpg)
అహ్మదాబాద్: 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్య ప్రదేశ్లో నెలకొన్న సంక్షోభం నుంచి గట్టెక్కకుండానే కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలకు సరిగ్గా కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. ఎమ్మెల్యేలు సోమగంద, కేవీ కాకడీయ ఇప్పటికే రాజీనామా చేయడంతో పార్టీలో తీవ్ర అలజడి మొదలైంది. తాను కోరుకున్న వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా సోమగంద ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
మరోవైపు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. గుజరాత్లో ఆ పార్టీకి చెందిన మొత్తం 73 మంది ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలను శనివారమే జైపూర్ తరలించింది. ఇవాళ మరికొందరు ఎమ్మెల్యేలు రాజస్థాన్ రాజధానికి తరలనునున్నట్టు సమాచారం. ఈ నెల 26న గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక నేతలు చెబుతున్నదాన్ని బట్టి మొత్తం 5గురు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటేయనున్నట్టు చెబుతున్నారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ నిలువబెట్టిన రెండు రాజ్యసభ స్థానాలు దక్కాలంటే 74 ఓట్లు అవసరమవుతాయి. ఇప్పటికే స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.