తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు పోలీసులపై వేటు..
ABN , First Publish Date - 2020-07-19T05:18:02+05:30 IST
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ముందు తల్లీకూతుళ్లు ఆత్మాహుతికి యత్నించిన కేసులో..

అమేథి: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ముందు తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించిన కేసులో ముగ్గురు పోలీసుపై సస్పెన్షన్ వేటు పడింది. తమ భూవివాదం కేసులో స్థానిక పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. అమేథి జిల్లా మహిళ ఒకరు లక్నోలో ఇవాళ తన కుమార్తెతో కలిసి ఒంటికి నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. అయితే లక్నో పోలీసులు మాత్రం కాంగ్రెస్ నేత అనూప్ పటేల్ కావాలనే సదరు మహిళ ఆత్మాహుతి చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపిస్తున్నారు. ‘‘నేరపూరిత కుట్ర’’లో భాగంగానే దీనికి ఉసిగొల్పారంటూ అనూప్ పటేల్ సహా మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కాగా బలవన్మరణానికి యత్నించిన సదరు మహిళకు 90 శాతం కాలిన గాయాలైనట్టు లక్నో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ.. కుమార్తె ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉందని తెలిపారు. కాగా అమేథి ఎస్పీ ఖ్యాతి గార్గ్ మాట్లాడుతూ.. ‘‘అమేథిలోని జామో పోలీస్ స్టేషన్కి చెందిన ఇంచార్జ్ ఎస్హెచ్వోతో సహా మొత్తం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది. బాధితురాలు చేసిన ఆరోపణలపై అదనపు ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం...’’ అని పేర్కొన్నారు.