ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు.. మరో విషయం బయటపడిందేంటంటే..
ABN , First Publish Date - 2020-03-31T02:37:06+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో కొత్తగా...
![ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు.. మరో విషయం బయటపడిందేంటంటే..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020033009030421/03302020210637n44.jpg)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో.. ఢిల్లీలో ఇప్పటివరకూ నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో దాదాపు 300 మందిని ఆసుపత్రులకు తరలించి ప్రభుత్వం కరోనా నిర్ధారిత టెస్ట్లు చేయిస్తోంది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చి నెల రెండో వారంలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్తాన్ దేశాల నుంచి ప్రజలు హాజరయ్యారు. వీరితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో ఒకరు కరోనా బారిన పడి మరణించగా.. 10మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరిపై నిఘా పెట్టి వారిని బస్సుల్లో ఢిల్లీలోని ఆసుపత్రులకు తరలించింది. తిరిగి వారి స్వదేశాలకు వెళ్లేందుకు లాక్డౌన్ అమలు నేపథ్యంలో విమాన సర్వీసులు లేకపోవడంతో వారంతా దేశ రాజధానిలోనే ఉన్నారు.