బెంగళూరులో శనివారం నుంచి 20,000 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు
ABN , First Publish Date - 2020-07-11T05:08:08+05:30 IST
శనివారం నుంచి బెంగళూరులో 20,000 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయనున్నట్లు...

బెంగళూరు: శనివారం నుంచి బెంగళూరులో 20,000 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయనున్నట్లు కర్ణాటక వైద్యవిద్యా శాఖ మంత్రి సుధాకర్ శుక్రవారం ప్రకటించారు. బెంగళూరు నగరంలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకే కర్ణాటక ప్రభుత్వం మొగ్గు చూపింది. బెంగళూరులో శుక్రవారం ఒక్కరోజే 1,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మరణాలు కూడా ఐటీ నగరాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం బెంగళూరు నగరంలో కరోనా వల్ల 29 మంది మరణించారు. యాంటీజెన్ టెస్టులు చేస్తే ఇంకెన్ని కేసులు బయటపడే అవకాశం ఉందోనన్న సందేహం వ్యక్తమవుతోంది.
మన శరీరంలోకి చేరిన రోగ కారకాన్ని యాంటీజెన్(ప్రతిజనకం) అంటారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఆ వెంటనే రోగ నిరోధక వ్యవస్థ మోహరించే రక్షక భటులే యాంటీబాడీలు(ప్రతిరక్షకాలు). యాంటీజెన్ను గుర్తించడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకిందా? లేదా ? అనేది నిర్ధారించేందుకు యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. వైరస్ సోకిన కొద్ది గంటల్లో ఈ టెస్టు చేస్తే పాజిటివ్గా చూపిస్తుంది. ఒకవేళ వైరస్ ఎటాక్ చేయకపోతే నెగెటివ్ వస్తుంది. సాధారణంగా యాంటీజెన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి మళ్లీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో కూడా పాజిటివ్ వస్తే వారికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారించి చికిత్స అందిస్తారు.