కోవిడ్-19 రోగి కోలుకున్నందుకు సంబరాలు... గోద్రాలో 11 మందిపై కేసు...
ABN , First Publish Date - 2020-05-10T03:01:15+05:30 IST
గుజరాత్లోని గోద్రాలో కోవిడ్-19 రోగి కోలుకున్నందుకు అతని కుటుంబ సభ్యులు,
న్యూఢిల్లీ : గుజరాత్లోని గోద్రాలో కోవిడ్-19 రోగి కోలుకున్నందుకు అతని కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగువారు సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 11 మందిపై కేసు నమోదు చేశారు.
40 ఏళ్ళు పైబడిన వయసుగల కోవిడ్-19 రోగి 14 రోజుల చికిత్స అనంతరం జీఎంఈఆర్ఎస్ ఆసుపత్రి నుంచి ఇంటికి గురువారం చేరుకున్నారు. ఆయన భార్య కూడా కోవిడ్-19 నుంచి కోలుకుని శుక్రవారం ఇంటికి చేరారు.
గోద్రా ‘బి’ డివిజన్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంఫీ పాండ్య మాట్లాడుతూ గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందన్నారు. జీఎంఈఆర్ఎస్ ఆసుపత్రిలో 14 రోజుల చికిత్స అనంతరం విడుదలైన ఓ వ్యక్తి గురువారం ఇంటికి చేరారన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన పిల్లలు, ఇరుగు, పొరుగువారు ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వీరు కాకుండా సుమారు 50 మంది ఇతరులు పాల్గొన్నట్లు తెలిపారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించడంలో విఫలమైనందుకు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత సోమవారంనాటికి నిందితులను అరెస్టు చేస్తామన్నారు. మరొక 50 మందిపై కూడా కేసు నమోదు చేశామని, వారిని గుర్తించవలసి ఉందని తెలిపారు.