‘కరోనా’ వైద్యసిబ్బందికి నిద్రలేమి!
ABN , First Publish Date - 2020-04-15T16:05:56+05:30 IST
ముందు వరుసలో ఉండి కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిలో మూడింట ఒకవంతు మంది నిద్రలేమి(ఇన్సోమ్నియా), మానసిక కుంగుబాటుతో
మూడింట ఒకరికి ఇదే సమస్య
తమకు.. కుటుంబానికి ఇన్ఫెక్షన్ సోకుతుందేమోననే ఆందోళన
చైనా శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక
బీజింగ్, ఏప్రిల్ 14 : ముందు వరుసలో ఉండి కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిలో మూడింట ఒకవంతు మంది నిద్రలేమి(ఇన్సోమ్నియా), మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నారట. చైనాలోని గ్వాంగ్జు నగరంలో ఉన్న సౌతెర్న్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. కరోనా రోగులకు సేవలు అందించిన 1,563 మంది వైద్యసిబ్బందితో సర్వే జరపగా, 564 మంది(36.1 శాతం)లో నిద్రలేమి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పీపీఈ) ధరించి విరామం లేకుండా రోజూ 12 గంటలు విధులు నిర్వహించడంతో కలుగుతున్న అలసట.. రోగుల నుంచి తమకు, తమ నుంచి కుటుంబీకులకు కరోనా ఇన్ఫెక్షన్ సోకుతుందేమోననే ఆందోళన వైద్యసిబ్బంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. దీంతో దీర్ఘకాలంలో వారికి నిద్రలేమికి సంబంధించిన సమస్యలు, మానసిక కుంగుబాటు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రతికూలతలను అధిగమించేలా ప్రభుత్వ యంత్రాంగాలు వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు.