మూడేళ్ల సర్వీసు ఉన్న ప్రైవేటు టీచర్లంతా అర్హులే

ABN , First Publish Date - 2020-12-31T05:06:43+05:30 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదుకు జిల్లాలోని ప్రైవేటు,అన్‌ఎయిడెడ్‌ హైస్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్ల అర్హతలపై డీఈవో సీవీ రేణుక స్పష్టత ఇచ్చారు.

మూడేళ్ల సర్వీసు ఉన్న ప్రైవేటు టీచర్లంతా అర్హులే

నేడు ఎమ్మెల్సీ ఓటు నమోదుకు తుది గడువు 

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 30 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదుకు జిల్లాలోని ప్రైవేటు,అన్‌ఎయిడెడ్‌ హైస్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్ల అర్హతలపై డీఈవో సీవీ రేణుక స్పష్టత ఇచ్చారు. ప్రైవేటు హైస్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్లలో 2014 నవంబరు 11వ తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ వరకూ మధ్య ఆరేళ్ల కాలంలో మూడు సంవత్సరాల సర్వీసును నిరం తరంగా గాని లేదా విడివిడిగా గాని పూర్తి చేసినవారు ఓటు హక్కు పొందేందుకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులేనని వివరించారు.ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లకే ఓటుహక్కు ఉంటుందని బుధవారం ఓ పత్రికలో తప్పుగా ప్రచురితం అయ్యిందన్నారు. గత ఆరేళ్లకాలంలో కనీసం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు దరఖాస్తులను సంబంధిత తనిఖీ అధికారి లేదా ఎంఈవో సంతకంతో డీఈవో కార్యాలయానికి పంపిస్తే ధృవీకరి స్తామన్నారు. ప్రైవేటు హైస్కూళ్ళల్లో పనిచేస్తున్న అర్హతలు గల టీచర్ల నుంచి ఓటు నమోదు తక్కువగా ఉందని నమోదు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డీవైఈవోలు, ఎంఈవోలను ఆదేశించారు. అర్హత కల్గిన టీచర్లకు సర్వీసు సర్టిఫికెట్‌ను నిరాకరిస్తే సంబంధిత స్కూలు యాజమాన్యంపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే తప్పుడు సర్వీసు సర్టిఫికెట్‌ జారీ చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదుకు ఈనెల 31వ తేదీ చివరి గడువు అని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-31T05:06:43+05:30 IST