అరెస్ట్లు ఉద్యమాన్ని ఆపలేవు
ABN , First Publish Date - 2020-12-18T05:12:23+05:30 IST
హౌస్ అరెస్ట్లు, దిగ్బంధనాలు ఉద్య మాన్ని ఆపలేవని అమరావతి రాజధానిని సాధించుకుంటామని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), టీడీపీ జిల్లా కార్యాలయ సమన్వయ కమిటీ కన్వీనర్ పాలి ప్రసాద్ గురువారం పేర్కొన్నారు.

అమరావతిని సాధించుకుంటాం
టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రాధాకృష్ణయ్య
ఏలూరు టూటౌన్, డిసెంబరు 17: హౌస్ అరెస్ట్లు, దిగ్బంధనాలు ఉద్య మాన్ని ఆపలేవని అమరావతి రాజధానిని సాధించుకుంటామని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), టీడీపీ జిల్లా కార్యాలయ సమన్వయ కమిటీ కన్వీనర్ పాలి ప్రసాద్ గురువారం పేర్కొన్నారు. అమరావతి రాజధాని కావాలంటూ అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమం సంవత్సరం అయిన దృష్ట్యా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతలు బడేటి చంటి, పాలి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, తదితర నాయకులను బుధవారం రాత్రి నుంచి హౌస్ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి, పాలి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు ధోరణి అవలంభించడం దుర్మార్గ మన్నారు. అన్యాయం జరిగిన వారు నిరసన తెలపడం సహజమని, వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి స్వేచ్ఛ లేకపోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నియంతలా వ్యవహరిస్తారని, ఇలాంటి నియంతలెంతో మంది కాలగర్భంలో కలిసి పోయా రన్నారు. అరెస్ట్లకు భయపడేది లేదని అమరా వతిని సాధించుకు తీరతామన్నారు. ఉద్యమాన్ని ఎంత అణిచివేస్తే అంతగా ఉవ్వెత్తున లెగుస్తుందన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచక పాలనకు ప్రజలు అంతం పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్ద అమరావతికి మద్దతుగా బడేటి చంటి, కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఏలూరు కార్పొరేషన్ : ఇఫ్టూ, న్యూడెమోక్రసీకి ఎటువంటి సంబంధం లేని చలో అమరావతి విషయమై పోలీసులు తనను నిర్బంధించడం అప్రజాస్వామికమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం రాత్రంతా తమ ఇంటి వద్దే పోలీసులు కాపలా ఉండడం తగదన్నారు. అలాగే అమరావతిలో జరిగే ఒకటే రాజధాని సమావేశానికి వెళ్లనివ్వకుండా పోలీసులు బుధవారం రాత్రి నుంచి సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ను సత్రంపాడులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా హౌస్ అరెస్టులు చేయడం తగదని, ఉద్యమాలతో పోరాటాలు ఆగవన్నారు.
ఏలూరులో సీపీఐ ప్రదర్శన
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మూడు రాజ ధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురు వారం పాతబస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్ని నిర్బంధాలు పెట్టినా రాజధానిగా అమరావతిని సాధించుకుని తీరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వర రావు, నాయకులు పుప్పాల కన్నబాబు, ఉప్పులూరి హేమశంకర్, కడుపు కన్నయ్య, సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, కొండేటి రాంబాబు, జి.స్వాతి పాల్గొన్నారు.