రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ కంచాలతో నిరసన
ABN , First Publish Date - 2020-12-28T05:05:52+05:30 IST
ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా స్థానిక సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు.
![రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ కంచాలతో నిరసన](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122711325032/12272020233347n94.jpg)
చాగల్లు, డిసెంబరు 27: ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా స్థానిక సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు కే పోశమ్మ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు.
కొయ్యలగూడెం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొయ్యలగూడెంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో కంచాలతో నిరసన కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు తామంతా సంఘీభావం తెలుపుతున్నామని తెలిపారు.
బుట్టాయగూడెం: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం బుట్టాయగూడెం బస్టాండ్ సెంటరులో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు తెల్లం రామకృష్ణ, ఉడతా వెంకటేశ్వరావు, కోర్స జలపాలు, తామా ముత్యాలమ్మ, మొడియం నాగమణి, జి.పవన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలన్నారు. రైతు సంఘాలు పిలుపులో భాగంగా ఆదివారం ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపినట్లు రామకృష్ణ తెలియజేశారు. ఢిల్లీ శివారులో 32 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ నాయకుడు ఎ.రవి తదితరులు ప్రసంగించారు.