ఒకటి కాదు.. రెండా?

ABN , First Publish Date - 2020-12-29T05:22:46+05:30 IST

ఆంధ్ర, తెలంగాణ సరి హద్దుల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

ఒకటి కాదు.. రెండా?
పులి

ఆంధ్రా – తెలంగాణ సరిహద్దుల్లో పులుల సంచారంపై సందేహం

మరో ఆవుపై దాడి.. లభ్యం కాని ఆచూకీ.. 

కుక్కునూరు, డిసెంబరు 28 : ఆంధ్ర, తెలంగాణ సరి హద్దుల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీనికితోడు పశువు లపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉండటంతో ఈ ప్రాంతవాసులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. మరోవైపు అటవీ శాఖ అధికారులు పులులు ఒకటా ? రెండా అనే అనుమానాలు వ్యక్తం చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కుక్కునూరుకు ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కుడుములపాడు అడవిలో ఆదివారం రాత్రి ఓ ఆవుపై పులి పంజా విసిరింది. సోమవారం ఉదయం ఆవులను కట్టేసి ఉంచిన ప్రాంతానికి గిరిజనులు వెళ్లగా ఆవు కనిపించ లేదు. వారు గాలింపు చర్యలు చేపట్టగా ఆ ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించాయి. ఆ దారిలో కాస్త దూరం వెళ్లగా అక్కడ ఆవు మృతదేహం ఉంది. దీని వెనుకభాగాన్ని పులి తిన్నట్లు గుర్తించారు. తెలంగాణ అటవీ శాఖాధికారులకు సమాచారమం దించారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పులి పాదముద్రలు సేకరించి, వైద్య సిబ్బందితో పోస్టుమార్టం నిర్వహించారు. పాదముద్రలను బట్టి గుండ్లమడుగు ప్రాంతంలో గుర్తించిన పులి పాద ముద్రల కన్నా, కుడుముల పాడులో పాద ముద్రలు వేరుగా ఉన్నట్టు గమ నించారు. దీంతో రెండు పులుల సంచారం ఆంధ్రా–తెలంగాణ అడవుల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. దీంతో సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న క్రమంలో ప్రజల్లో భయం వెంటాడుతుంది. 

Updated Date - 2020-12-29T05:22:46+05:30 IST