వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్
ABN , First Publish Date - 2020-12-28T05:46:05+05:30 IST
వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
11 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి
130 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్లు
నాలుగు ప్రాంతాల్లో 132 కేవీ సబ్స్టేషన్లు
ఏలూరు సిటీ, డిసెంబరు 27 : వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొమ్మిది గంటలపాటు సరఫరా చేస్తున్నా మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ సబ్ స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంచటంతో పాటు కొత్తగా లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 98 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 950 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటన్నింటికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.140 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. జిల్లాలో 11చోట్ల 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించారు. 68 విద్యుత్ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. టి.నరసాపురం, ధర్మాజీగూడెం, ద్వారకా తిరుమల, నారాయణపురం గ్రామాల్లో రూ.30 కోట్లతో 132 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది. నిరంతరాయంగా నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్రాన్స్కో ఎస్ఈ జనార్దనరావు తెలిపారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొత్తగా 11 చోట్ల సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు.