పశ్చిమ గోదావరి జిల్లాలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు.. ఎప్పటి నుంచి అంటే..
ABN , First Publish Date - 2020-12-11T05:41:23+05:30 IST
సినీ ప్రేక్షకులకు శుభవార్త. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో సినీ సందడి మళ్లీ మొదలుకానుంది.
బొమ్మ వేసేద్దాం..
25 నుంచి సినీ సందడి
థియేటర్లు తెరవాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం
విద్యుత్ బకాయిలపై తేల్చని ప్రభుత్వం
కరోనా నిబంధనల నడుమ నిర్వహణకు ఏర్పాట్లు
50 శాతం మేరే టిక్కెట్ల విక్రయాలు
ఏలూరు కల్చరల్, డిసెంబరు 10 : సినీ ప్రేక్షకులకు శుభవార్త. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో సినీ సందడి మళ్లీ మొదలుకానుంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం అనంతరం కాంప్లెక్స్ల్లోని ఒక్కో థియేటర్ మాత్రమే తెరుచుకోనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల నడుమ 50 శాతం మాత్రమే టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి మిగతా థియేటర్లను ప్రారంభిస్తామని యాజ మాన్యాలు చెబుతున్నాయి. వాస్తవానికి లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా అక్టోబరు నుంచే సినీ వినోదానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకోవచ్చునని ఆదేశించింది. కానీ, పెండింగ్ విద్యుత్ బిల్లుల రద్దు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో యాజమాన్యాలు ఇప్పటివరకు థియేటర్లు తెరవలేదు. జిల్లావ్యాప్తంగా ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు తదితర పట్టణాలు, గ్రామాల్లో 90 థియేటర్లు ఉన్నాయి.ఇప్పుడు వీటిని తెరిస్తే ఖర్చులైనా వస్తాయో రావోనన్న భయంతో సినీ ఎగ్జిబిటర్లు ఉన్నారు. లాక్డౌన్ సమయంలో బిల్లులు చెల్లించకపో వడంతో విద్యుత్ అధికారులు థియేటర్ల ఫీజులు తీసివేశారు. బకాయిల రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.