16 నుంచి ‘నన్నయ’ సెట్‌

ABN , First Publish Date - 2020-10-04T07:31:31+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని నన్నయ ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు.

16 నుంచి ‘నన్నయ’ సెట్‌

7 నుంచి హాల్‌ టిక్కెట్లు జారీ : వీసీ

రాజమహేంద్రవరం, అక్టోబరు 3 : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని నన్నయ ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు. విశ్వవిద్యాలయంలో శనివా రం నన్నయ సెట్‌ 2020 పరీక్షలకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ను వీసీ విడుదల చేశారు. నన్నయ సెట్‌కు 6810 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కొవిడ్‌  నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.


పశ్చిమగోదావరి  జిల్లాకు సంబంధించి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ తాడేపల్లిగూడెం, శ్రీ సీఆర్‌రెడ్డి పీజీ కళాశాల ఏలూరు, కేజీఆర్‌ పీజీ కళాశాల భీమవరం, శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెంలో పరీక్షలు జరుగుతాయని వీసీ తెలిపారు. నాలుగు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.


16న ఉదయం లైఫ్‌ సైన్సెస్‌, మధ్యాహ్నం మ్యాథమెటిక్స్‌, జియాలజీ, 17న ఉదయం ఫిజికల్‌ సైన్సెస్‌, మధ్యాహ్నం కంప్యూటర్‌ సైన్స్‌, 18న ఉదయం కెమికల్‌ సైన్స్‌, మధ్యాహ్నం హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌, 19న ఉదయం ఇంగ్లీషు, ఎంపీఈడీ, మధ్యాహ్నం హిందీ, తెలుగు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఈ నెల 7వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను లేదా 70930 08477 నెంబరులో సంప్రదించాలని వీసీ తెలిపారు.

Updated Date - 2020-10-04T07:31:31+05:30 IST