కుళ్లిన వరి చేలు
ABN , First Publish Date - 2020-09-29T09:11:01+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి చేలు నీట మునిగి కుళ్లిపోవడంతో ఎందుకు పనికిరాకుండా పోయా యి. సారా ఆదిలోనే నష్టం రావడంతో రైతులు కుమిలిపోతున్నారు.
![కుళ్లిన వరి చేలు](https://media.andhrajyothy.com/appimg/galleries/20200929032582/09292020034054n5.jpg)
ముంచిన వర్షం
రైతుకు తీరని నష్టం
పాలకోడేరు, సెప్టెంబరు 28: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి చేలు నీట మునిగి కుళ్లిపోవడంతో ఎందుకు పనికిరాకుండా పోయా యి. సారా ఆదిలోనే నష్టం రావడంతో రైతులు కుమిలిపోతున్నారు. మండలంలోని మోగల్లు గ్రామంతోపాటు శివారు ప్రాంతమైన గుత్తులవారిపాలెంలో గోస్తనీనది పొంగి వారం రోజులపాటు వరి చేలన్నీ నీటిలోనే మునిగిఉన్నాయి.
నీరు తగ్గిన తరువాత చేలన్నీ కుళ్లిపోయి ఎందుకు పనికిరాకుండా ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది సార్వా సాగు మొదటి నుంచి ఒడిదుడుకులతోనే సాగింది. చేలు ముంపు బారిన పడడంతో ఒక్కొక్క రైతు రెండు పర్యాయాలు నాట్లు వేసుకున్నారు.
ఇప్పటికే ఎకరాకు దమ్ము చేయడానికి రూ.3 వేలు, విత్తనాలకు రూ.1500, నాట్లు వేయడానికి రూ.1500, ఎరువులకు రూ.7 వేలు, పురుగులమందులకు రూ.2 వేలు, రెండో దఫా ఎరువులకు రూ.1500, గుళికలకు రూ.వెయ్యి, కలుపుతీతకు రూ.వెయ్యి, ఇతర ఖర్చులకు రూ.1500 మొత్తం సుమారు 20 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని రైతులు తెలిపారు.
ఇంత చేసిన తరువాత ప్రకృతి కన్నెర్ర చేయడంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.