వచ్చే రెండు వారాలే కీలకం
ABN , First Publish Date - 2020-03-23T11:12:11+05:30 IST
కరోనా నివారణకు వచ్చే రెండు వారాలే కీలకమని..
![వచ్చే రెండు వారాలే కీలకం](https://media.andhrajyothy.com/appimg/galleries/20200323052946/03232020111122n44.jpg)
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా నివారణకు వచ్చే రెండు వారాలే కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. కరోనా వైరస్ నిరోధించడంలో భాగంగా ఆమె ఆదివారం రాత్రి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు ముందస్తుగా జిల్లాలో 200 పడకలను సిద్ధం చేయాలని, టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
యూపీ నుంచి 28 మంది అనుమానితులు
జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ ఇటీవల జిల్లా నుంచి యూపీ వెళ్లిన 28 మంది ఈనెల 23 తెల్లవారుజామున విజయవాడ రానున్నారని వారిలో 12 మందికి జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయని సమాచారం అందిందన్నారు. వారందరూ సంఘ మిత్ర ఎస్-6 బోగిలో 12 మంది, జనరల్ బోగిలో 16 మంది వస్తున్నారని తెలిసిందన్నారు. వారిని విజయవాడ రైల్వే స్టేషన్లోనే ఆపి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు.