ప్రజా కోర్టుకు వెళదాం.. అసెంబ్లీ రద్దు చేయండి
ABN , First Publish Date - 2020-08-07T11:45:04+05:30 IST
మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం తప్పనిసరి.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్
భీమవరం టౌన్, ఆగస్టు 6 : మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం తప్పనిసరి. ధైర్యం ఉంటే ప్రజా తీర్పుకు సిద్ధం కావాలని వైసీపీ నాయకులకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సవాల్ విసిరారు. ఎన్నికలకు సిద్ధం కాకపోతే ప్రజలను మోసం చేసిన ట్లేనని ప్రజలకు అర్ధమవుతుందన్నారు. ప్రజాకోర్టుకు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధా నిని స్వాగతించి, అధికారంలోకి రాగానే రాజధాని మార్చడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు.
పవిత్ర యజ్ఞంలా రాజధాని నిర్మాణం చేపట్టారని, రాజధానిని మూడు ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ను కాలరాసే చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షను బట్టే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు. మూడు రాజధానులు కావాలా.. అమరావతి కావాలా.. అనే అంశంపై వైసీపీ నాయకులు రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, సవాల్ను స్వీకరించాలని ఆమె డిమాండ్ చేశారు.