పడిగాపులు కాయాల్సిందే..!
ABN , First Publish Date - 2020-11-08T04:57:18+05:30 IST
రేషన్ షాపుల వద్ద సర్వర్ పనిచేయక పోవడంతో కార్డుదారులు గంటల తరబడి ఎదురు చూసి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
![పడిగాపులు కాయాల్సిందే..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110711244460/11072020232646n72.jpg)
ఒక్కో కార్డుకు 20 నిమిషాల పైనే..
దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురుచూపులు
నిలుచోలేక వెనక్కి వెళ్లిపోతున్న కార్డుదారులు
ఆరు రోజుల్లో 42.46 శాతం పంపిణీ
ఏలూరు రూరల్, నవంబరు 7: రేషన్ షాపుల వద్ద సర్వర్ పనిచేయక పోవడంతో కార్డుదారులు గంటల తరబడి ఎదురు చూసి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈనెల 2వ తేదీ నుంచి 15వ విడత బియ్యం, శనగలు, చక్కెర పంపిణీ ప్రారంభించారు. మండలంలో 80 రేషన్ షాపులు ఉండగా సుమారు 80 వేల మంది పైగా కార్డుదారులు ఉన్నారు. సాదారణంగా నాలు గైదు రోజుల్లో పంపిణీ పూర్తికావాల్సి ఉండగా ఆరు రోజులు గడిచినా కేవలం మండలంలో 42.46 శాతం మందికి మాత్రమే సరుకులు అందాయి. అంటే రోజుకు సరాసరిన ఏడు శాతం మందికి మించి రేషన్ అందడం లేదు. సర్వర్ పూర్తిగా డౌన్కావడంతో ఒక కార్డును నమోదు చేయాలంటే 15 నుంచి 20 నిమిషాలు సమయం పడుతోంది. అంటే గంటకు ఇద్దరు లేదా ముగ్గురు మించి సరుకులు అందడం లేదు. శనివారం సాయంత్రం వరకు కేవలం 40 వేల మందికి మాత్రమే సరుకులు అందాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వర్ను మెరుగుపర్చాలని అటు డీలర్లు, ఇటు కార్డు దారులు ప్రతిసారి పౌరసరఫరాల శాఖ అధికారులను విన్నవించుకుంటున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. కార్డుదారులు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాసి సర్వర్ పనిచేయక అసహనంతో తిరిగి ఇంటిముఖం పడుతున్నారు. ప్రతి రేషన్ షాపు వద్ద సరుకుల కోసం కార్డుదారులు క్యూలో గంటల తరబడి ఉండాల్సి వస్తోంది.