-
-
Home » Andhra Pradesh » West Godavari » rates
-
కొనలేం..తినలేం..
ABN , First Publish Date - 2020-11-01T05:09:32+05:30 IST
విపరీతంగా పెరిగిపోయిన ధర లతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నా యి.

మండుతున్న నిత్యావసరాలు
అమాంతం పెరిగిన నెలవారీ ఖర్చు
కడుపు మాడ్చుకుంటున్న సామాన్యులు
ఏలూరు రూరల్, అక్టోబరు 31 : విపరీతంగా పెరిగిపోయిన ధర లతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. ఒకవైపు కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే మరోవైపు పప్పులు, నూనెల ధరలు ఠారెత్తిస్తున్నాయి. కరోనాకు ముందు రెండం కెలలో ఉన్న పప్పు, ఉల్లి, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు మూడంకెలకు చేరాయి. నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలవారీ ఖర్చు అదనంగా రూ.రెండు వేలకు పైగా పెరగడంతో సామా న్యుల గుండె బరువెక్కుతోంది. కరోనా ప్రభావంతో అసలే ఆదాయం తగ్గి అవస్థలు పడుతున్న సగటుజీవి బతుకు భారంగా మారింది. కరోనా ముందు ధరలతో పోలిస్తే వేరుశనగ, సన్ఫ్లవర్, పామాయిల్ లీటరుపై రూ.30 వరకు పెరి గింది. కందిపప్పుతో పాటు మిగి లిన పప్పుదినుసులు కొనలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగాయి. ఆ ప్రభావం సరుకు లపై పడింది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ఘాటెక్కింది. కిలో రూ.100 పలుకుతుండడంతో కూరల్లో ఉల్లి మాయమైంది. రెస్టారెంట్లు, హోటళ్లల్లో ఉల్లి వాడే అల్పాహారం ధరలు పెరిగాయి. భారీ వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలో ఎక్కువగా సాగయ్యే కర్నూలులో ఉల్లి పంట బాగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతో మార్కెట్కు సరుకు తక్కువగా వస్తోంది. ఈక్రమంలో ధర ఆమాంతం పెరిగింది. కరోనా వ్యాప్తితో మసాలాలకు గిరాకీ పెరిగింది. కొవిడ్ నుంచి రక్షణ పొందాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. దగ్గు, జలుబు వంటివి దరి చేరకుండా చూసుకోవాలి. దీంతో జనం పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో మసాలా దినుసులు, ధనియాలు, ఎండుమిర్చి వంటి వాటి వాడకం పెరగడంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి.
గత మూడు నెలల్లో నిత్యావసరాల ధరలు రూపాయల్లో..
సరుకు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు
వేరుశనగ నూనె 120 130 150
సన్ప్లవర్ 96 105 120
పామాయిల్ 78 85 100
వేరుశెనగ గింజలు 120 90 120
కందిపప్పు 86 100 120
మినపప్పు 85 95 110
మిరియాలు 350 420 450
ధనియాలు 80 90 105