కౌలు రైతుకు నిబంధనాలు
ABN , First Publish Date - 2020-12-01T05:41:49+05:30 IST
ఈ క్రాప్లో పేరు ఉంటేనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనిపిస్తోంది. అదే పేరుతో ఈ క్రాప్లోవున్న రైతుల పేర్లతోనే బిల్లులు నమోదు కానున్నాయి. అటువంటి రైతులే ధాన్యం విక్రయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధానమే జిల్లాలో కౌలు రైతులకు శాపంగా మారింది.
సీసీఆర్సీ పత్రాలు లేకపోవడంతో కొనుగోళ్లు బంద్
ఈ క్రాప్లో నమోదు తప్పనిసరి
లేదంటే కౌలు రైతులకు తిప్పలే
జిల్లాలో 2.45 లక్షల మంది కౌలు రైతులు
పత్రాలు ఇచ్చింది 1.06 లక్షల మందికే
తాడేపల్లిగూడెం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పెంటపాడు మండలంలో గెద్దా కృష్ణ అనే కౌలు రైతు రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటచేతి కొచ్చి అమ్ముకుందామంటే నిబంధనలు అడ్డొచ్చాయి.ఈ క్రాప్లో పేరు నమో దు చేసుకుంటేనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. అందులో నమోదు చేయాలంటే పంటసాగు అర్హత పత్రం ఉండాలి. భూ యజమాని అంగీకరి స్తేనే కార్డు మంజూరవుతుంది. యజమాని స్థానికంగా లేకపోవడంతో అంగీ కారం తెలపలేకపోయారు. దీంతో కృష్ణకు సీసీఆర్సీ కార్డు మంజూరుకాలేదు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మే వీలులేక బయట మార్కెట్లో మద్దతు ధరకంటే తక్కువకు ధాన్యం విక్రయించాల్సి వచ్చింది.
జిల్లాలో వేల మంది కౌలు రైతులు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొను గోలు కేంద్రాలలో అమ్ముకునే అవకాశం లేక లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితులను సొమ్ము చేసుకోవడానికి దళారులు సిద్ధంగా ఉన్నారు. తక్కువ ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రాప్లో పేరు ఉంటేనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనిపిస్తోంది. అదే పేరుతో ఈ క్రాప్లోవున్న రైతుల పేర్లతోనే బిల్లులు నమోదు కానున్నాయి. అటువంటి రైతులే ధాన్యం విక్రయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధానమే జిల్లాలో కౌలు రైతులకు శాపంగా మారింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.06 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే సీసీఆర్సీ పత్రాలు మంజూరుచేశారు. జిల్లాలో దాదాపు 2.45 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. గతంలో వారికి రుణార్హత పత్రాలు మంజూరు చేసేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో సాగు హక్కు పత్రాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో సాగు హక్కు పత్రాల జారీలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాము ఉత్పత్తి చేసే ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించుకునే మార్గం కనిపించడం లేదు. దీనిని దళారులు అవకాశంగా మార్చుకుని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు తక్కువ దిగుబడులతో లబోదిబోమంటున్న కౌలు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ క్రాప్ విధానం మరింత నష్టపెడుతోంది.