ఎంటీయూ – 1121 సాగు చేయండి : జేడీ
ABN , First Publish Date - 2020-12-02T04:52:24+05:30 IST
రబీకి అనుకూలమైన.. తక్కువ కాలపరిమితి 130 రోజుల కల్గిన ఎంటీయూ–1121 వరి రకాన్ని సాగు చేయాలని వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగం సూచించారు.

తణుకురూరల్/ ఉండ్రా జవరం/ పెంటపాడు/అత్తిలి, డిసెంబరు 1 : రబీకి అనుకూలమైన.. తక్కువ కాలపరిమితి 130 రోజుల కల్గిన ఎంటీయూ–1121 వరి రకాన్ని సాగు చేయాలని వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగం సూచించారు. తణుకు, ఉండ్రాజవరం, పెంటపాడు మం డలాల్లో రైతులకు మంగళవారం రబీ సాగుపై అవగాహన కల్పించారు. వెదజల్లే పద్ధతిని, డ్రీమ్సీడ్ పద్ధతులను ఉపయోగించి తక్కువ ఖర్చులోనూ, తొందరగా పంట పూర్తయ్యే విధానాలను రైతులు ఆచరించాలన్నారు. డిసెంబరు మొదటి వారంలోనే రైతులు దాళ్వా నారుమడులు పూర్తి చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు దృష్ట్యా కాలువలను మార్చి 31 వ తేదీ నాటికి కట్టివేస్తారన్నారు. రైతులందరూ సాగు పనులు వేగవంతంగా ముగించుకుని దాళ్వాలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలన్నారు. రైతులు సకాలంలో దాళ్వా వరి సాగు చేయాలని అత్తిలి తహసీల్దార్ ఏవీ రామాంజనేయులు సూచించారు.ఆమె వెంట ఏడీఏ పీ.మురళీకృష్ణ, ఏవో పార్థసారఽథి ఉన్నారు.
80 శాతం రాయితీపై దాళ్వా విత్తనాలు
ఉంగుటూరు : ఈ నెల ఏడవ తేదీలోగా దాళ్వా నారుమడులు పోసుకోవాలని భీమ డోలు వ్యవసాయ సహాయ సంచాలకులు కే.జయదేవ రాజన్ అన్నారు. మండలంలోని అప్పారావుపేట, దొంతవరం, కాకర్లమూడి గ్రామాల్లో మంగళవారం పంట నష్టం వాటిల్లిన వ్యవ సాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతులకు 80 శాతం రాయితీపై దాళ్వా వరి విత్తనాలను మూడు రోజుల్లో అందిస్తామన్నారు.ఆయన వెంట ఏవో బాలిన వెంకటేష్ సిబ్బంది ,రైతులు పాల్గొన్నారు.