మద్యం బాటిల్తో పట్టుబడ్డ వ్యక్తిపై కానిస్టేబుల్ జులుం..?
ABN , First Publish Date - 2020-11-14T05:21:00+05:30 IST
ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మద్యం బాటిల్తో పట్టుబడ్డ తన నుంచి రూ.5వేలు తీసుకుని పోలీస్స్టేషన్కు రాగానే బూటు కాలితో తన్నాడంటూ మారేడుబాక గ్రామానికి చెందిన నాంపల్లి తారకాచారి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం విలేకరుల ముందు ఆరోపించారు.
రూ.5వేలు తీసుకుని పోలీస్ స్టేషన్లోనే బూటు కాలితో తన్నాడంటూ బాధితుడి ఆరోపణ
కుక్కునూరు, నవంబరు 13 : ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మద్యం బాటిల్తో పట్టుబడ్డ తన నుంచి రూ.5వేలు తీసుకుని పోలీస్స్టేషన్కు రాగానే బూటు కాలితో తన్నాడంటూ మారేడుబాక గ్రామానికి చెందిన నాంపల్లి తారకాచారి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం విలేకరుల ముందు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని సారపాకకు తారకాచారి కార్పెంటర్ పని నిమిత్తం వెళ్లాడు. తిరిగి వస్తూ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా కేక్, ఒక మద్యం బాటిల్ తీసుకుని ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వేలేరు గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అతని వద్ద మద్యం బాటిల్ పట్టుపడడంతో పోలీసులు మద్యాన్ని అక్కడే పారపోశారు. ఒక కానిస్టేబుల్ మాత్రం తన వద్ద నుంచి రూ.5వేలు తీసుకుని సెల్ఫోన్ లాక్కున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పోలీస్టేషన్కు వెళ్లగానే తన మొలతాడు తెంపివేసి ఆచారంగా వేసుకున్న జంధ్యాని పక్కన పెట్టించి తన షర్ట్ను ఇప్పించాడు. అనంతరం లోపలకు తీసుకువెళ్లి బూటుకాలితో తన్నాడని తారకాచారి ఆరోపిస్తున్నాడు.
ఎస్ఐ వివరణ...
జరిగిన సంఘటనపై ఎస్ఐ పైడిబాబును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరింది. తెలంగాణ నుంచి ఒక్క మద్యం బాటిల్ను తీసుకువచ్చినా కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే ఆరోపణలతో స్టేషన్లోకి వచ్చిన వ్యక్తి ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా మొలతాడు లాంటివి తొలగిస్తామని తెలిపారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ కూడా రూ.5వేలు తీసుకోలేదని ఎస్ఐ స్పష్టం చేశారు.