పింఛన్కు మూడు రోజులు
ABN , First Publish Date - 2020-12-01T05:51:37+05:30 IST
పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో అందజేత
బయోమెట్రిక్ పడనివారికి పీడీవో ద్వారా పంపిణీ
కొత్త మార్గదర్శకాలు విడుదల
ఏలూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ డిసెంబరు నుంచి మూడు రోజులపాటు పింఛన్లకు జారీకి వీలుగా ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. తొలిరోజు బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేసి, మిగిలిన రెండు రోజులు బయోమెట్రిక్ పడని వారికి పింఛన పంపిణీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి సంబంధించి ఎంపీడీవో, కమిషనర్లకు తాజాగా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయం నుంచి తొలిరోజే బయోమెట్రిక్, ఫొటోలు తీసి అందరికి పింఛన్లు అందజేసేవారు. ఈ డిసెంబరు ఒకటో తేదీ నుంచి మూడు రోజులపాటు పింఛను పంపిణీ విధానం అమలులోకి వస్తుంది. 1వ తేదీన వేలిముద్రలు, ఐరిష్ స్కానింగ్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తయినవారికి మాత్రమే పింఛను అందజేస్తారు. బయోమెట్రిక్ కానివారికి 2, 3 తేదీలలో పీడీవో (పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ అథారిటీ) అథెంటికేషన్తో అందిస్తారు. పింఛను పంపిణీ సమయంలోనే వలంటీర్లు బయోమెట్రిక్ ఫెయిల్ అయిన వారి వివరాలను పీడీవో అథెంటికేషన్కు పంపుతారు. అందుకోసం తొలిరోజు సాయంత్రం ఆరు గంటల్లోపు ఫెయిలయిన పింఛను దారుల నెంబర్లు, పేర్ల వివరాలను ఆయా మండల, మున్సిపల్ అధికారుల అథెంటికేషన్ కోసం పంపుతారు. పీడీవో ఆమోదం పొందిన తరువాత వీరి పేర్లు మాత్రమే వలంటీర్ లాగిన్లలోకి వస్తాయి. రెండు, మూడు రోజుల్లో వీరికి మాత్రమే పింఛను అందు తుంది. డయాలసిస్, డీఎంహెచ్వో–హెల్త్ పింఛను దారులకు సం బంధించిన సమాచారం కూడా తొలిరోజు సాయంత్రం 6 గంటల్లోపు పీడీవో అథెంటికేషన్కు చేరుకోవాలి.
దుర్వినియోగంపై అనుమానాలు
ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల వక్రమార్గాలు బయటపడుతున్న ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆఫ్లైన్ పింఛను సదుపాయంపై లబ్ధిదా రుల్లో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఆఫ్లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని అందుబాటులో లేని వారి వివరాలను కూడా వలంటీర్లు పీడీవో అథెంటికేషన్కు పంపించే అవకాశం లేకపోలేదు. ఇలా తమకు రావాల్సిన పింఛను రాకుండా పోతుందేమోనన్న అను మానాలు పింఛనుదారులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండదని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
అవకతవకలకు అవకాశం లేదు: జే.ఉదయభాస్కర్, డీఆర్డీఏ పీడీ
అవకతవకలకు అవకాశమే లేదు. డిస్ట్రిబ్యూటింగ్ అఽథారిటీ అన్నీ పరిశీలించిన తరువాతే అథెంటికేషన్ ఇస్తుంది. దీనికోసం పటిష్టమైన సాఫ్ట్వేర్ను వినియో గిస్తున్నారు.అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే వారిపై తక్షణ చర్యలు ఉంటాయి.