ఆపరేషన్ ముస్కాన్తో... తల్లీ కుమారుడు కలిశారు
ABN , First Publish Date - 2020-07-18T11:35:12+05:30 IST
ఆపరేషన్ ముస్కాన్ పాల కొల్లుకు చెందిన తల్లీ కొడుకును కలిపింది. పాలకొల్లుకు బొబ్బా శ్రీలత భర్త మృతి చెందగా ఇద్దరు ..
పాలకొల్లు టౌన్/ కొవ్వూరు, జూలై 17 : ఆపరేషన్ ముస్కాన్ పాల కొల్లుకు చెందిన తల్లీ కొడుకును కలిపింది. పాలకొల్లుకు బొబ్బా శ్రీలత భర్త మృతి చెందగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో పాత ఇనుప సామాన్ల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. నాలుగేళ్ళ కిందట చిన్న కుమారుడు శ్రీనివాస్ ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శ్రీలత చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయిం చింది. అయితే ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా విజయవాడ పోలీసులు వీధిబాలలతో పాటు కనిపించిన శ్రీనివాస్ను వివరాలు అడగ్గా పాలకొల్లు అని చెప్పడంతో పాలకొల్లు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పట్టణ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఆరా తీసి బొబ్బా శ్రీలత కుమారుడిగా గుర్తించి పట్టణ ఎస్ఐ జెవిఎన్ ప్రసాద్ను, తల్లి శ్రీలతను విజయవాడ పంపించి బాలుడిని తల్లి వద్దకు చేర్చారు. కొవ్వూరులో 9 మంది బాల కార్మికులను గుర్తించామని పట్టణ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. పట్టణంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. బాలలతో ఎవరైనా పనిచేయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.