సరికొత్త టెన్షన్.. అన్నంలో పాదరసం.. కూరగాయల్లో పురుగుల మందు అవశేషాలు
ABN , First Publish Date - 2020-12-12T06:54:33+05:30 IST
ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలు దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే సీసం, నికెల్ ప్రభావం అత్యధికం ఉన్నట్లు చెబుతూనే ఆహారం, కూరగాయల్లో పాదరసం, పురుగు మం దుల అవశేషాలు ఉన్నట్టు పలు సంస్థలు ధ్రువీకరించాయి.
ఇప్పటి వరకు అస్వస్థతకు గురైన వారు 611
కోలుకుని ఇంటికి వెళ్లినవారు 569
శుక్రవారం నమోదైన కేసులు 5
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఏడుగురు
అన్నంలో పాదరసం(మెర్య్కురీ) ఛాయలు కనిపించినట్లు ఎన్ఐఎన్ వెల్లడించింది. కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించా యని సీసీఎంబీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. నీటి విషయంలో అపోహ పడాల్సిన అవసరం లేదు. వాయు కాలుష్యం ఏమీ లేదని ఎయిమ్స్, ఎన్ఐ సీటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పాయి. ఎయిమ్స్ రెండోసారి ఇచ్చిన నివేదికల్లోనూ బాధితుల్లో సీసం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
– వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్
దిగ్ర్బాంతి కలిగిస్తున్న నివేదికలు
పురుగుల మందులు, రసాయనాలు అధిక వాడకమే వింత వ్యాధికి కారణమా ?
తాగునీటిలోనూ అక్కడక్కడ సీసం, నికెల్
ఏళ్ల తరబడి నుంచి ఇదే పరిస్థితా..?
ప్రజల్లో మొదలైన ఆందోళన
ఏలూరులో తాగునీరు సురక్షితమేనని
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడి
నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన..
పలు సూచనలు చేసే అవకాశం
ఏలూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలు దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే సీసం, నికెల్ ప్రభావం అత్యధికం ఉన్నట్లు చెబుతూనే ఆహారం, కూరగాయల్లో పాదరసం, పురుగు మం దుల అవశేషాలు ఉన్నట్టు పలు సంస్థలు ధ్రువీకరించాయి. వందలాది మంది అస్వస్థతకు గురి కావడానికి ఇదే కారణ మని పేర్కొన్నాయి. వాస్తవానికి ఒక్క తాగునీటిలోనే కలుషిత కారకాలు, భారలోహాలు ఉంటాయని ఊహించినప్పటికీ దీనికి భిన్నంగా ఆహార పదార్థాల్లోనూ పురుగు మందుల అవశేషాలు బయటపడటం దిగ్ర్భాంతికి గురిచేశాయి. ఇదే విషయం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్) ప్రస్తావించింది. తినే అన్నంలో పాదరసం ఛాయలు కనిపిస్తున్నట్లు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం. అసలు ఇది ఎలా సాధ్యమని రకరకాలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి. జిల్లా వాసులు సోనామసూరి రకం బియ్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత స్వర్ణ, రేషన్ బియ్యాన్ని వాడతారు. ఇప్పుడు అన్నంలోనే పాదరసం ఛాయలు కనిపించడంతో.. ఇది ఏ రకం బియ్యంలోననే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పురుగు మందుల అవశేషాలు
అసలే కార్తీక మాసం. ఈ నెలలో చేపలు, మాంసంకంటే ఎక్కువ మంది కూరగాయలనే తీసుకుంటారు. ఈ సమయంలో వీటి ధరలు పెరుగుతాయి. ప్రత్యేకించి టమాటా అసాధారణ స్థాయిలో వినియోగించారు. ఇపుడు కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు వున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అధిక దిగుబ డులు, చీడపీడల నుంచి పంటలను రక్షించుకునేందుకు కూరగాయల్లో ఎడాపెడా పురుగు మందులను పరిమితి లేకుండా వాడేస్తున్నారు. దీని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోకుండా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇపుడదే విష యం వింతరోగంలో బయటపడ్డాయి. నిషేధించిన పురుగు మందులను కూరగాయల పంటల్లో వాడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చిత్రం ఏమిటంటే రక్తనమూనాలు భారలోహాలు బయటపడగా ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నారు.
మరి వీటి సంగతి ఏమిటి?
ఏలూరు వింత రోగం అంతు చూసేందుకు ప్రముఖ సంస్థలన్నీ ఏలూరు నుంచి ఢిల్లీ వరకు ల్యాబ్లలో పరీక్షలు నిర్వహించాయి. ఫలితాలు కనుగొనడానికి ఒకటి, రెండుసార్లు ప్రయత్నించాయి. పదే పదే శాంపుల్స్ తీసుకున్నారు. దక్షిణం వీధి, కొత్తపేట, తూర్పు వీధి, పదేబాద, నూకాలమ్మ సెంటర్, తంగిళ్లమూడి, పవర్పేట వంటి ప్రాంతాలన్నింటిలోనూ నీటి నమూనాలు సేకరించి మరీ పంపారు. కేంద్ర సంస్థలకు తోడుగా జిల్లా భూగర్భ జలశాఖ నీటి కాలుష్య కారకాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో క్లోరిన్ పరిమితికి మించి శాంపిల్స్లో ఉన్నట్లు తేల్చడం తాజా పరిణామం. ఏలూరు, పత్తేబాధలో నమూనాలు సేకరించినపుడు డైక్లోరోమీఽథేన్ (డీసీఎం) అనే రసాయనం ఉన్నట్లు మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. నగరంలో అత్యధికులు దిగువ, మధ్యతరగతి కుటుంబాలు కుళాయి నీటినే వినియోగిస్తాయి. ఈ నీళల్లోనే ఇది బయటపడింది. అయినప్పటికి తాజా విశ్లేషణలో కేంద్ర సంస్థలేవీ వీటిని మచ్చుకైనా పేర్కొనలేదు. కొవిడ్ సమయంలో నీటి కాలుష్యం తొలగించేందుకు ఎడా పెడా మందుల వాడటంతో అవి ప్రభావితం చూపిస్తాయని అను మానం వ్యక్తం చేశారు. క్లోరిన్ తీవ్రత ఆయా ప్రాంతాల్లో ఉ న్నట్లు గాని, రసాయనం మిళితమైనట్లు గాని ఎంఐఎం సంస్థ వద్ద నుంచి మిగతా ఏవి ప్రస్తావించలేదు. కాలుష్య నియంత్రణ మండలి వాయు కాలుష్యాన్ని గమనించేందుకు ప్రయత్నించలేదు. పెద్దగా లేదని స్పష్టం చేసింది. మునిసిపాలిటీ శా ఖ పరిధిలో తాగునీటి శాంపిల్స్ను పరిశీలిస్తే ఎక్కడా భార లోహాలు కాని, ఆర్గన్క్లోరిన్స్ గాని, ఆర్గన్ పా స్పరస్ కనిపించలేదని స్పష్టంగా ఉంది. తాగునీరు, ఆహార పదార్థాల్లో తేడాలు బయటపడటంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. నాలుగైదు రోజుల్లో విరుడుగు ఏమిటనేది ప్రభుత్వం ప్రకటించబోయింది.
అందరూ బాధితులే..!
ఏలూరు క్రైం, డిసెంబరు 11 : నగరంలో ప్రబలిన వింత వ్యాధి బారిన అన్ని వయసుల వారు ఉన్నారు. తొలుత చిన్న పిల్లలకు రావడంతో ఇది మెదడువాపుగా భావించారు. గంట ల వ్యవధిలోనే పెద్ద వారికి సోకడంతో మెదడు వాపు కాదని నిర్ధారణకు వచ్చారు. ఆ తరువాత వైద్య బృందాలు, నిపుణు లు రంగంలోకి దిగి అన్వేషణ చేపట్టారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఏమిటనే దానిపై అధ్యయనం సాధించారు. శుక్ర వారం రాత్రి 9 గంటల వరకూ 611 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 569 మంది డిశ్చార్జి కాగా, 34 మంది విజ యవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఏడుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఓ వ్యక్తి మరణించారు. మగవారే ఈ వ్యాధి బారిన ఎక్కువ పడినట్టుగా గుర్తించారు.
వయస్సు వ్యాధిగ్రస్తులు పురుషులు–స్త్రీలు
12 ఏళ్ల లోపు 76 44–32
12–35 337 172–165
35 పైబడిన 198 111–87
పుణెలో కొనసాగుతున్న పరీక్షలు
ఏలూరు క్రైం, డిసెంబరు 11 : అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, పలు ప్రాంతాల్లో సేకరించిన పాలు, నీళ్లు, కూరగాయలు, పం డ్లు, మట్టి వంటి వాటిని సంబంధిత నిపుణులు పుణెకు పం పించారు. విమానాల కార్గో సర్వీస్ ద్వారా గురువారం సా యంత్రానికి ఢిల్లీకి కొన్ని చేరుకోగా, మరికొన్ని పుణెకు చేరు కున్నాయి. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎం ఎస్, న్యూఢిల్లీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్(ఎన్ఐఎన్) సంస్థలు ఇప్పటికే అనేక శాంపి ల్స్ను సేకరించి పరీక్షలు కొనసాగించాయి. పరీక్షల ఫలితాలు కొన్ని శనివారం, మరికొన్ని 16వ తేదీన రానున్నాయి.
వైజాగ్, కాకినాడ ల్యాబ్లకు ఆక్వా నీటి శాంపిల్స్
ఏలూరు టూ టౌన్, డిసెంబరు 11 : ఏలూరు ప్రజలు అనారోగ్యానికి గురికావడానికి ఆక్వా సాగు కొంత కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏలూ రు చుట్టుపక్కల వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఇందులో రైతులు మోతాదుకు మించి ఫెస్టిసైడ్స్ వాడుతు న్నారు. చేపలు, రొయ్యలు పట్టిన తరువాత చెరువుల్లోని నీటిని పంట కాల్వలోకి వదిలేస్తున్నారు. ఆ నీరే తాగునీటికి వాడుతున్నారు. ఆ నీళ్లల్లో డెల్టా మ్రైత్రిన్(ఆర్గానోక్లోరో) అనే ఫెస్టిసైడ్ ఉంటుంది. ఆ నీరు తాగునీటిలో కలవడం వల్ల మనుషుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శీతాకాలం లో చేపలు, రొయ్యలకు పేను పడుతుంది. వీటి నివారణకు నువాన్ ఎకలెక్స్, ఎక్క అనే హెర్బల్ పౌడర్ను వాడుతారు. ఈ ఫెస్టిసైడ్స్ ఎక్కువైతే మనుషులకు కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. ఇతర జబ్బులు పోవడానికి ఐవర్ మెన్టిన్ అనే యాంటీబయోటిక్ వాడతారు. ఈ మందుల్లో సీసం, నికెల్, కాల్షియం ఉంటుంది. ఆక్వా చెరువుల్లో నీటిని ఎంత శుభ్రపర్చినప్పటికీ ఫెస్టిసైడ్స్ అవశేషాలు నెల రోజులపాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆ నీటిని నెల రోజుల వరకు వాడకూడదు.
‘ఏలూరు ప్రజల వింత వ్యాధికి గురవడంలో ఆక్వా చెరువుల నీటి వల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనేది తెలుసుకోవడానికి చేపల చెరువుల్లోని నీటి శాంపిల్స్ను తీసుకున్నాం. రెండు రోజుల కిందట వీటిని విశాఖలోని మత్స్యశాఖ రిఫరల్ ల్యాబ్కు, కాకినాడలోని పొల్యూషన్ ల్యాబ్కి పంపాం. రెండు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది’ అని మత్స్యశాఖ ఏడీ వేముల తిరుపతయ్య తెలిపారు.
