వైటీ రాజా ఆశయాలు కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-11-26T05:49:23+05:30 IST
మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మన మధ్య లేకున్నా ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, ముళ్ళపూడి వెంకట కృష్ణారావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం తదితరులు పిలుపునిచ్చారు.

వక్తల పిలుపు .. సేవా కార్యక్రమాల నిర్వహణ
తణుకు, నవంబరు 25: మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మన మధ్య లేకున్నా ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, ముళ్ళపూడి వెంకట కృష్ణారావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం తదితరులు పిలుపునిచ్చారు. బుధవారం రాజా పెద్దకర్మను పురస్కరించుకుని ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్పందన మానసిక వికలాంగుల పాఠశాలలో, సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం, ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో భోజనాలు వడ్డించారు. నాయకులు తమరాపు పల్లపరావు, తాతపూడి మారుతీరావు, గుమ్మళ్ళ హనుమంతరావు, చింతలపూడి సన్యాసిరావు, వల్లూరి గంగారావు, ఎలుబూడి ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఉచిత సుగర్ వైద్య శిబిరం
పాతూరు కాపుల రామాలయం వీధిలో స్వర్ణ క్లబ్ ఆధ్వర్యంలో సుగర్ వైద్య శిబిరాన్ని లయన్స్ జిల్లా ఛైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వైటీ రాజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైటీ రాజా చేసిన సేవలను కొనియాడారు. డాక్టర్ రాజగోపాల్ వైద్య సేవలు నిర్వహించారు. సరళాదేవి, రమేష్ ఆర్థిక సహాయంతో 90 మందికి మందులను అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్ సుంకవల్లి శ్రీనివాస్, సెక్రటరీ చిరంజీవి కుమారి, కరుణాకర చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కోనాలలో సంతాప సభ..
తణుకు మండలం కోనాల గ్రామంలోని పెంటపాడు డీసీ అధ్యక్షుడు, ప్రాజెక్టు కమిటీ డైరెక్టర్ బూరుగుపల్లి వీర వెంకట త్రినాథరావు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. అధికారంతో సంబంధం లేకుండా వైటీ రాజా ప్రజల బాగోగులు కోసం నిరంతరం పరితపించేవారన్నారు. కోనాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.