మండలానికో జూనియర్ కళాశాల
ABN , First Publish Date - 2020-07-14T11:33:52+05:30 IST
గ్రామీణ ప్రాం తాల్లో ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది.
![మండలానికో జూనియర్ కళాశాల](https://media.andhrajyothy.com/appimg/galleries/20200714052211/07142020060327n25.jpg)
కొత్తగా 25 కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు
హైస్కూళ్ల అప్గ్రెడేషన్కు చర్యలు
ఏలూరు ఎడ్యుకేషన్, జూలై 13 : గ్రామీణ ప్రాం తాల్లో ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం అధికారి కంగా నిర్ణయం తీసుకుంటే 2020-21 విద్యా సంవత్సరం నుంచే నూతన కళాశాలలు ప్రారంభమయ్యే అవకా శాలు న్నాయి. జిల్లాలో మొత్తం 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభిం చేందుకు ఇటీవల ప్రతిపాదించారు. పాఠశాల విద్యాశాఖ నేతృత్వంలో జిల్లా పరిషత్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న హైస్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. హైస్కూలులో 500 మందికి పైబడి విద్యార్థులు ఉన్నచోట కొత్తగా ప్రభుత్వం జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తూ, సంబంధిత హైస్కూల్ను అప్గ్రేడ్ చేస్తారు. సెక్షన్కు 40 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో కళాశాలకు గరిష్టంగా తొమ్మిది సెక్షన్లను కేటాయించాలని, ఆ మేరకు అదనంగా ఉన్న సెక్షన్లను మూసి వేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ఇంతకు ముందు మాదిరి ఇబ్బడి ముబ్బడిగా విద్యార్థులను చేర్చుకునే వీలుండదు. మరోవైపు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ అడ్మిషన్ల విధానం, పరిమితితో కూడిన నిర్ధేశిత ఫీజులు వంటి చర్యలతో ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు అమలులోకి రానున్నాయి.
ఈ ఏడాది టెన్త్ విద్యార్థులంతా కరోనా విజృంభణ కారణంగా పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలకు భారీ డిమాండ్ ఏర్పడ నుంది. జిల్లాలో టెన్త్ విద్యార్థులు 50,027 మంది కరోనా కారణంగా ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ విద్యను ప్రభుత్వం పాఠశాల విద్య పరిధిలోకి తెచ్చింది. వాస్తవానికి డిమాండ్ ఉన్నచోట ప్రభుత్వ హైస్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి ‘సక్సెస్’ పథకం కింద ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో 500 మంది పైబడి విద్యార్థులున్న హైస్కూళ్ల నుంచి అందరికీ అనువుగా ఉండి, వసతులు వున్న హైస్కూళ్లను జూనియర్ కళాశాలలుగా ఏర్పాటు చేయా లని తాజాగా ప్రతిపాదించారు. కనీసం మండలానికి ఒకటి చొప్పున జూని యర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఆ మేరకు కళాశాల ఏర్పాటుకు కావాల్సిన విధి విధానాలు, అధ్యాపక సిబ్బంది నియామకాలు వంటి విషయాలపై ఇంటర్ బోర్డు తదుపరి కార్యా చరణను చేపడుతుంది. ప్రస్తుతం ఆయా హైస్కూళ్లలో వున్న స్కూల్ అసిస్టెంట్ కేటగిరి సబ్జెక్టు నిపుణులనే డిప్యుటేషన్పై జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా నియమించడం కాని అదే కొరత ఉన్నచోట కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల నియామకాలు చేపట్టడం కాని జరిగే అవకాశాలు ఉన్నాయి.
కొత్త జూనియర్ కళాశాలలు
ఆచంట, అత్తిలి, చాగల్లు, చింతలపూడి, దెందులూరు, దేవరపల్లి, ద్వారకా తిరుమల, గణపవరం, ఇరగవరం, జీలుగుమిల్లి, కాళ్ళ, కామవరపు కోట, లింగ పాలెం, మొగల్తూరు, నిడమర్రు, పాలకోడేరు, పెదపాడు, పెంటపాడు, పోడూరు, ఉండి, ఉంగుటూరు, వీరవాసరం, టి.నర్సాపురం హైస్కూళ్ళను ప్రభుత్వ జూని యర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. పెరవలి మండలంలో రెండు హైస్కూళ్ళను అప్గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.