ఇసుక బుక్‌ చేస్తే.. మట్టి పంపించారు

ABN , First Publish Date - 2020-08-07T11:45:33+05:30 IST

ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇసుక తెచ్చుకోవడం వినియోగదారులకు తలనొప్పిగా మారింది.

ఇసుక బుక్‌ చేస్తే.. మట్టి పంపించారు

పెంటపాడు, ఆగస్టు, 6 : ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇసుక తెచ్చుకోవడం వినియోగదారులకు తలనొప్పిగా మారింది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంటే ఎప్పుడొస్తుందో తెలీదు. తీరా వచ్చాక ఎలా ఉంటుందో అసలే తెలియదు. పెంటపాడు మండలంలోని జట్లపాలెంలో ఇసుక ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే మట్టి కలిపిన ఇసుక పంపిచారంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. జట్లపాలెంలో ఎస్సీ కాలనీలో నామాల నాగరత్నం అనే మహిళ తన భవనం స్లాబ్‌ మరమ్మతుల కోసం రూ.8 వేలు ఇచ్చి ఆన్‌ లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంది. 35 రోజుల తరువాత ఇసుక వచ్చింది. తీరా చూస్తే ఇసుక మొత్తం ఎర్రమట్టితో  కలసిపోయి ఉంది.


దీంతో నిర్మాణ పనులు చేసే తాపీమేస్త్రీ ఇది పనిచేయదని, పునాదిలో వేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుందని చెప్పాడు. దీంతో బాధితురాలు తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇసుక వచ్చేసింది కదా..ఇక మేము ఏమీ చేయలేమంటూ అధికారులు  తేల్చి చెప్పేశారు. కావాలంటే మళ్లీ బుక్‌ చేసుకోమని ఉచిత సలహా పడేశారు. రూ.8 వేలకు బుక్‌ చేసుకున్నాం. ఇంటివద్దకు మోయించుకోవడానికి మరో రూ.4 వేలు ఖర్చుచేశాం. మేము కూలి పని చేసుకుని బతికేవాళ్లం.. మళ్లీ ఇసుక బుక్‌ చేసుకోవాలంటే వేలాది రూపాయలు కావాలి. అంత స్తోమత లేదు.  అధికారులు న్యాయం చేయాలంటూ’ వెంకటరత్నం వాపోయింది.

Updated Date - 2020-08-07T11:45:33+05:30 IST