గోదావరి జలాల కాలుష్యంపై ప్రాజెక్టు సర్వే
ABN , First Publish Date - 2020-12-11T05:10:35+05:30 IST
గోదావరి జలాల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రమాదకర కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో చేపట్టిన ’స్ర్పింగ్ ’ (స్ట్రేటజిక్ ప్లానింగ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నావెల్ బయోటెక్నికల్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్) ప్రాజెక్టు ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది.
నాలుగు యూరప్ దేశాలు.. 3 ఐఐటీ సంస్థలు
తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరం రూపొందించే ప్రణాళిక
భీమవరం, డిసెంబరు 10 : గోదావరి జలాల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రమాదకర కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో చేపట్టిన ’స్ర్పింగ్ ’ (స్ట్రేటజిక్ ప్లానింగ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నావెల్ బయోటెక్నికల్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్) ప్రాజెక్టు ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. గత ఏడాది భారత ప్రభుత్వం ఒప్పందం మేరకు దేశంలోని గౌహతి, ఖరగ్పూర్, వారణాసి ఐఐటీలు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సహకారంతో యూరోపియన్ యూనియన్లోని నార్వే, ఫిన్లాండ్, హంగేరి, పోర్చుగల్ దేశాలు సంయుక్తంగా సర్వే చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2016–17లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (టీఎస్టీ) ఆధ్వర్యంలో జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీలకు జలాలు శుద్ధి చేశాక కూడా రక్షిత నీటి సరఫరాలో కాలుష్యంపై పరీక్షలు చేసి డీఎస్టీకి నివేదిక సమర్పించారు. దీంతో గోదావరి జలాలపై సమగ్రమైన అవగాహనకు వీలుంటుందని సర్వేను అమలు చేస్తున్నారు.
‘భీమవరం మునిసిపల్’లో కాలుష్య నివారణ ప్రణాళిక..
భీమవరం పురపాలక సంఘంలో సరఫరా అయ్యే తాగునీటిని బయో టెక్నాలజీ వినియోగించి నీటి శుద్ధి చేసే ప్రణాళిక అమలు చేయనున్నారు. గోదావరి జిల్లాల్లో ఉన్న కాలుష్య కారకాలను గుర్తించి. వాటిని శుద్ధి చేసేందుకు ఒక పరికరాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకు దేశీయంగా ఎలిక్సర్ అనే పారిశ్రామిక సంస్థ సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుందని భీమవరం వెట్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు తెలిపారు. శుద్ధి చేసే యంత్ర పరికరం రూపొందిస్తే ప్రజలకు పైపుల ద్వారా పంపిణీ చేసే రక్షిత నీటిని చివరి దశలో కూడా శుద్ధి చేసి పంపించే అవకాశం ఉంటుంది.