రుణం కట్టాల్సిందే

ABN , First Publish Date - 2020-04-21T08:13:37+05:30 IST

లాక్‌డౌన్‌తో ఇల్లు గడవగమే కష్టంగా మారుతుండగా డ్వాక్రా రుణాలు చెల్లింపులు, వాయిదాలు కట్టాలంటూ డ్వాక్రా మహిళలపై సీసీలు తీవ్ర ఒత్తిడి తెస్తు న్నారు. ఆర్బీఐ నుంచి మూడు నెలల పాటు మారటోరియం ప్రకటించినా...

రుణం కట్టాల్సిందే

డ్వాక్రా సంఘ సభ్యులపై సీసీల ఒత్తిళ్లు


ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 20 : లాక్‌డౌన్‌తో ఇల్లు గడవగమే కష్టంగా మారుతుండగా డ్వాక్రా రుణాలు చెల్లింపులు, వాయిదాలు కట్టాలంటూ డ్వాక్రా మహిళలపై సీసీలు తీవ్ర ఒత్తిడి తెస్తు న్నారు. ఆర్బీఐ నుంచి మూడు నెలల పాటు మారటోరియం ప్రకటించినా డ్వాక్రా సంఘాల లీడర్ల ద్వారా బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. దీంతో  డ్వాక్రా సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొంతమంది అవ సరాలు నిమిత్తం బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. బ్యాంకు నిబంధనల మేరకు నెలనెలా అసలు, వడ్డీ చెల్లించాలి. సభ్యులు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి  వాయిదా సొమ్ముతో పాటు ప్రతి నెలా పొదుపు కింద రూ.100 కడు తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకుండా పోయాయి. ఈ తరుణంలో రుణాలు చెల్లింపుకు ఆర్బీఐ మారిటోరియం విధించింది. మహిళా సంఘాల సభ్యులను బలవంతపు వసూళ్లు చేయవద్దని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే కింది స్థాయి  సిబ్బంది మాత్రం పరి గణలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు విన్పి స్తున్నాయి. రూరల్‌ ప్రాంతాల్లో వెలుగు అధికారులు, అర్బన్‌ ప్రాంతాల్లో మెప్మా అధికారులు బలవంతపు వసూళ్లకు దిగడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకులు పని చేస్తున్నాయని బకాయిలు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. దీంతో సభ్యులు నానా అగచాట్లు పడి రుణాలు చెల్లిస్తున్నారు. ఈ కష్టకాలంలో తమపై ఒత్తిడి తేవద్దని మహిళలు కోరుతున్నారు. 


డబ్బులు లేవన్నా కట్టాలంటున్నారు..

లావణ్య, ఏలూరు 

నా భర్త కూలీ పనులకు వెళ్లితేనే పూట గడిచేది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక అవస్థలు పడుతున్నాం. తీసుకున్న రుణానికి డబ్బులు కట్టాల్సిందేనంటూ సీసీలు ఒత్తిడి ఎక్కువైంది.  ఈనెల కట్టలేమంటే కట్టాల్సిందేనంటున్నారు. బ్యాంకులు తెరిచే ఉంటున్నాయి.. కట్టండి లేకపోతే వడ్డీ పడుతుందని మీకే నష్టం అంటూ బెదిరిస్తున్నారు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 


సీసీలు ఫోన్లు చేస్తున్నారు..

కృపావతి, చాటపర్రు

సభ్యుల నుంచి బలవంతపు వసూళ్లు చేయవద్దని అధికారులు చెబుతున్నారు. అయినా సీసీలు అధికారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. రుణాలు చెల్లించాలని సీసీలు పదేపదే ఫోన్లు చేస్తున్నారు. కొందరు నానా అగచాట్లు పడి చెల్లిస్తున్నారు.  అధికారులకు చెబితే కట్టేయండమ్మ మీకే మంచిది అంటున్నారు.   


Updated Date - 2020-04-21T08:13:37+05:30 IST