ఫ్లీజ్‌.. సహకరించండి

ABN , First Publish Date - 2020-03-27T10:39:01+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దయచేసి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు

ఫ్లీజ్‌.. సహకరించండి

ప్రజలను కోరిన డీఐజీ మోహనరావు  

నిబంధనలు మీరిన 7,346 వాహనాలపై కేసులు.. రూ.15 లక్షల ఫైన్‌

ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపే పనులు ముగించాలి.

సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకూ షాపులు తీయకూడదు.

ఆసుపత్రులు, మందుల షాపులు మాత్రమే తెరుచుకోవాలి.


ఏలూరు క్రైం,  మార్చి 26 : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దయచేసి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు కోరారు. ప్రజల సంచారాన్ని నియంత్రించేందుకు ఏలూరులో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను గురువారం ఆయన స్వయంగా తనిఖీ చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో మాస్క్‌లు లేకుండా బయటకు వచ్చిన వారికి.. మాస్క్‌లు కట్టి సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని సూచించారు.


తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాటు చేశామని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు వైద్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించి అక్కడ ఉంచుతామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఏలూరు రేంజ్‌ పరిధిలోని చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. కుక్కునూరు, జీలుగుమిల్లి, చింతలపూడి, రాజమండ్రి మార్గాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయన్నారు. అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి శిబిరాలకు తరలిస్తామన్నారు. 144 సీఆర్‌పీసీ అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు కాకుండా ఇతర షాపులు తెరిస్తే వారిపై 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న 7,346 (మోటారు సైకిళ్ళు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు) వాహనాలపై కేసులు నమోదు చేసి వారి నుంచి 15 లక్షల రూపాయల వరకు అపరాధ రుసుము విధించామన్నారు.


ఏలూరు రేంజ్‌ పరిధిలో ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే సరుకులు, కూరగాయలు తెచ్చుకోవాలన్నారు. నిత్యావసర సరుకులు, మందులు వంటి వాటికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోపే వెళ్లాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు బయటి పనులు చూసుకుని ఇంటికి వెళ్లిపోవాలన్నారు. సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకూ నిత్యావసర దుకాణాలు ఉండకూడదని, ప్రజలు కూడా రోడ్లపై కనిపించకూడదన్నారు. ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.


పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సోప్రియ అనే మహిళ ఆమె బంధువులు చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్‌కు అంబులెన్స్‌లో వెళుతుంటే హనుమాన్‌ జంక్షన్‌ వద్ద పోలీసులు ఆపివేశారని డీఐజీకి చెప్పగా ఆయన అంబులెన్స్‌కు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. త్రీటౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ మూర్తి, టూటౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌ ఉన్నారు.


Updated Date - 2020-03-27T10:39:01+05:30 IST