అనుమానం పెనుభూతమై..
ABN , First Publish Date - 2020-12-10T06:15:35+05:30 IST
అనుమానం పెనుభూత మై భార్యను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన పెదవేగి మండలం నాగన్నగూడెంలో బుధవారం జరిగింది.

రోకలి బండతో మోది భార్యను హత్య చేసిన భర్త
పెదవేగి, డిసెంబరు 9:అనుమానం పెనుభూత మై భార్యను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన పెదవేగి మండలం నాగన్నగూడెంలో బుధవారం జరిగింది. ఎస్ఐ టి.నాగవెంకటరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా రమణక్కపేటకు చెందిన రమణకు, పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ నాగన్నగూడెంకు చెందిన తనగాల భాస్కరరావుకు 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి కుమార్తె(15), కుమారుడు (11) ఉన్నారు. పిల్లలిద్దరూ వారి చిన్నాన్న ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన భర్త రోకలి బండతో భార్య తలపై మోదాడు. దీంతో తల పగిలి, రమణ (40) అక్కడికక్కడే మృతి చెందింది. ఏలూరు రూరల్ సీఐ ఎ.శ్రీనివాసరావు, పెదవేగి ఎస్ఐ టి.నాగవెంకటరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.