ఎన్నికలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-03-16T11:46:30+05:30 IST

రాష్ట్రంలో కరోనా ప్రభావం కారణంగా ముందుజాగ్రత్త చర్యలుగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు

ఎన్నికలకు బ్రేక్‌

కరోనా ప్రభావంతో 6 వారాలు వాయిదా  

కోడ్‌ మాత్రం అమలులోనే..

ముద్రిత బ్యాలెట్లను  స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచండి

అధికారులకు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశం


ఏలూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ప్రభావం కారణంగా ముందుజాగ్రత్త చర్యలుగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. మండలస్థాయి ఎన్నికల అధికారు లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఆరు వారాలపాటు వాయిదా పడినందున ఇప్పటికి ఎన్నికల నిర్వహణ స్థితి ఎలా ఉందో అలాగే ఉంటుందని, ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చాక తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ దాదాపు పూర్తయినందున వాటిని సీల్‌ చేసి ఏలూరు, హెడ్‌ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములో భద్రపరచాలన్నారు.


ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎక్కడా అతిక్రమణ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాలలోనే ఉండి బ్యాలెట్‌ పేపర్లు సీల్‌ చేయించి ఏలూరు పంపడంతోపాటు కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, జడ్పీ సీఈఓ శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T11:46:30+05:30 IST