మేతకు కొరత

ABN , First Publish Date - 2020-03-24T11:41:03+05:30 IST

లాక్‌డౌన్‌తో ఆక్వా రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే ఉత్పత్తులకు ఎగుమతులు లేక ఎక్కడిక్కడే

మేతకు కొరత

ఆక్వా ఫీడ్‌ షాపులు మూత

మేత దొరక్క  రైతుల ఇక్కట్లు


నరసాపురం, మార్చి 23:  లాక్‌డౌన్‌తో ఆక్వా రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే ఉత్పత్తులకు ఎగుమతులు లేక ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. తాజాగా ఫీడ్‌ దుకాణాలు కూడా అధికారులు మూయించి వేశారు. దీంతో మేత దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డీలర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. 


నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. అత్యధికంగా మొగల్తూరు మండలంలో అక్వా సాగు ఎక్కువ. వీటికి సంబంధించి ఫీడ్‌ దుకాణాలు నియోజకవర్గ పరిధిలో 30 దాకా ఉన్నాయి. రైతులు ఈ షాపుల నుంచి మేతను తీసుకెళుతుంటారు. శనివారం వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఆదివారం ప్రభుత్వం కొందరి వ్యాపారులకు మాత్రమే అనుమతినిచ్చింది.


అందులో మెడికల్‌, కిరాణా, పాలు దుకాణాలు వంటివి ఉన్నాయి. వీటిలో ఆక్వా షాపులు కూడా అనుమతిచ్చింది. అయితే అధికారులు తమకు ఉత్తర్వులు అందలేదంటూ షాపుల్ని మూయించి వేశారు. దీంతో మేత కోసం వచ్చిన రైతులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో చెరువులోని మత్స్య సంపదకు మేత లేకుండా పోయింది. జిల్లా అధికారుల అనుమతి ఉంటేగాని షాపులు తెరిపించమని అధికారులు తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-03-24T11:41:03+05:30 IST