గడప దాటితే గండం
ABN , First Publish Date - 2020-04-09T12:31:50+05:30 IST
కరోనా వైరస్ కట్టడి చేసేదిశగా అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు.
లాక్డౌన్కు నేటితో 19 రోజులు
రెడ్జోన్ పరిధిలో పకడ్బంధీ చర్యలు
ఈ వారం రోజులు అత్యంత కీలకం
కరోనా వైరస్ కట్టడి చేసేదిశగా అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్కి నేటితో 19 రోజులు గడిచాయి..కరోనాపై విజయం సాధించాలంటే ఈ వారం పదిరోజులు ఎంతో కీలకం. ఎవరూ గడప దాటకుండా ఈ గండం నుంచి గట్టెక్కే దిశగా ప్రజలు సహకరించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. రెడ్జోన్ ప్రాంతాలను మరింత కట్టడి చేస్తున్నారు.. ఎవరినీ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెడ్ జోన్ పరిధికి 150 మీటర్ల లోపు ఉన్నవారందరికీ నిత్యావసరాలు, కూరగాయలు ఇంటికే అందించే ఏర్పాట్లు చేశారు..
ఏలూరులో పకడ్బంధీగా బందోబస్తు
ఏలూరు రూరల్, ఏప్రిల్ 8 : ఏలూరులోని రూరల్ మండలం రెడ్జోన్ పరిధిలో పకడ్బంధీగా కర్ఫ్యూ తరహా బందోబస్తు అమలు చేస్తున్నారు. పాజిటివ్ బాధితులు ఉన్న తంగెళ్లమూడి, వైఎస్ఆర్ కాలనీ, విద్యానగర్ ప్రాంతాలను రెడ్జోన్గా గుర్తించారు. ఆ మూడు ప్రాంతాల్లో రెడ్జోన్ అమ లులో ఉంది. ఇక్కడ నుంచి ఒక్కరిని కూడా బయటికి రాకుండా చూస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలను పోలీసులు దిగ్బంధం చేశారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇళ్లవద్దకే పంపిస్తున్నారు.
నరసాపురంలో మెడికల్ రిపోర్టులపై టెన్షన్
రెడ్ జోన్లో ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. కూరగాయలు, పాలు, తదితర వస్తువులు ఇళ్లకు వెళ్లి అందించారు. రెడ్జోన్లో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ వాహనాల్లో నిత్యావసరాలు విక్రయించారు. పట్టణ పరిధిలో ఎక్కడా మాంసం, చేపల విక్రయాలు జరగనివ్వలేదు. షాపులన్నీ మూయించి వేశారు. మరోవైపు క్వారంటైన్కి తరలించిన వారి రిపోర్టులపై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఒకరికి పాజిటివ్ రావడంతో అతనితో దగ్గరగా మెలిగిన కుటుంబ సభ్యులు, మిత్రులు, ఒక పీఎంపీ వైద్యుడికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. మొత్తం క్వారంటైన్లో పట్టణ పరిధిలో 32 మంది ఉన్నారు. అయితే రిపోర్టులు గురు లేదా శుక్రవారాల్లో రానున్నాయి.