చీపురుపల్లిలో సినీఫక్కీలో చోరీ
ABN , First Publish Date - 2020-11-29T04:27:55+05:30 IST
చీపురుపల్లి సినీఫక్కీలో చోరీ జరిగింది. కిటికీ తెరచి బెడ్రూమ్లో ప్రవేశించిన ఆగంతకులు బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు
కిటికీలు తొలగించి.. బెడ్రూమ్లో ప్రవేశించి
10 తులాల బంగారం, 60 తులాల వెండి అపహరణ
చీపురుపల్లి, నవంబరు 28: చీపురుపల్లి సినీఫక్కీలో చోరీ జరిగింది. కిటికీ తెరచి బెడ్రూమ్లో ప్రవేశించిన ఆగంతకులు బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు. బెడ్రూమ్కు లోపల నుంచి గడియపెట్టి తిరిగి కిటికీ తీసి బయటకు వెళ్లిపోయారు. రెండు రోజుల కిందట జరిగినట్టు భావిస్తున్న చోరీ ఘటన...శనివారం బెడ్రూమ్ తాళాలను బలవంతంగా తొలగించడంతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హరిహర క్షేత్రానికి సమీపంలో ఎజ్జిపురపు అప్పలనాయుడు అనే ఆర్మీ ఉద్యోగి కుటుంబంతో నివాసముంటున్నారు. అప్పలనాయుడు వేరే ప్రాంతంలో విధుల్లో ఉండగా.. భార్య సంధ్యారాణి, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల సంధ్యారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకొని బిల్లలవలసలోని పుట్టింటికి వెళ్లింది. దీపావళి, నాగులచవితి పండుగలు పూర్తిచేసుకొని ఈ నెల 26న ఇంటికి చేరుకున్నారు. బెడ్ రూమ్ తలుపు తెరచుకోకపోవడంతో సాంకేతిక సమస్య అయి ఉంటుందని భావించారు. శనివారం కార్పెంటర్ సాయంతో తలుపు తొలగించడంతో బీరువాలో సామాన్లు చిందరవందరగా కనిపించాయి. లోపల ఉన్న 10 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్టు భావించి పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో ఘటనాస్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ను రప్పించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ చెప్పారు.