డిపోల్లో కానరాని నిబంధనలు
ABN , First Publish Date - 2020-05-17T10:44:14+05:30 IST
పట్టణంలోని నాలుగో విడత ఉచిత రేషన్ సరుకుల పంపి ణీ ప్రక్రియలో నిబంధనలు తుస్సుమన్నాయి

బొబ్బిలి, మే 16: పట్టణంలోని నాలుగో విడత ఉచిత రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియలో నిబంధనలు తుస్సుమన్నాయి. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన డిపోలు చాలా చోట్ల తెరుచుకోలేదు. లాక్డౌన్ నిబంధనల మేరకు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని, శానిటైజర్లు, సబ్బులు డిపోల్లో ఉంచుతూ టెంట్లు వేయాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ చాలా చోట్ల వాటి జాడ కనిపించలేదు. శానిటైజర్లు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. పట్టణం లోని పలు రేషన్ డిపోలు ఉదయం పదిగంటలైనా తెరుచుకోలేదు. కొన్ని డిపోలకు ఇన్చార్జీ డీలర్లు ఉండడంతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల టెంట్లు లేకపోవడంతో కార్డుదారులు మండుటెండలో గొడుగులు పట్టుకుని నిలుచోవాల్సి వచ్చింది.
ప్రభుత్వం కమీషన్ చెల్లించడంలో జాప్యం చేయడంతో డీలర్లు నిబంధనలను పక్కాగా అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం నాలుగోవిడత రేషన్ పంపిణీ ప్రారంభమవగా, ఒక విడతకు సంబంధించిన కమీషన్ను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని డీలర్ల సంఘం ప్రతినిధి గౌరీశంకర్ తెలిపారు. ఒక్కో విడతకు రూ.ఆరువేలు ఖర్చవుతుందన్నారు. కాగా సుమారు రూ.31 లక్షల మేర కమీషన్ డీలర్లకు ప్రభు త్వం చెల్లించాల్సి ఉందన్నారు. దీనిపై ఉన్నతాఽధకారులు స్పందించాలని ఆయన కోరారు.
దీనిపై బొబ్బిలి సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ గౌరీశంకర్ మాట్లాడుతూ... కిలోకు రూపాయి చొప్పున డీలర్లకు ఒక విడత కమీషన్ విడుద లైందన్నారు. ఆ సొమ్మును డీలర్లకు నేరుగా కాకుండా కార్డుదారులకు అవసర మైన పంచదారను విడుదల చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. డిపోల వద్ద టెంట్లు, శానిటైజర్లు, సబ్బులు వంటివి ఏర్పాటు చేయడంలో డీలర్లు పెద్దమనసుతో వ్యవహరించాలని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.. ఆరోగ్య భద్రత విషయంలో అందరూ శ్రద్ధ చూపాలన్నారు.