జై కొడితే.. బంపర్‌ ఆఫరే!

ABN , First Publish Date - 2020-03-13T11:21:18+05:30 IST

స్థానిక ఎన్నికల పుణ్యమా అని రోజువారీ కూలీలకు బంపర్‌ ఆఫర్‌ దక్కింది. రోజంతా పనిచేస్తే

జై కొడితే.. బంపర్‌ ఆఫరే!

జనసమీకరణకు భారీగా వెచ్చిస్తున్న కార్పొరేట్‌ అభ్యర్థులు

ప్రచారానికి సై అంటున్న రోజువారీ కూలీలు


విజయనగరం (ఆంధ్రజ్యోతి) మార్చి 12 : స్థానిక ఎన్నికల పుణ్యమా అని రోజువారీ కూలీలకు బంపర్‌ ఆఫర్‌ దక్కింది.  రోజంతా పనిచేస్తే రానీ కూలి..పూట ప్రచారానికి వెళ్తే రూ.300 నుంచి రూ.500 వరకు రాజకీయ పార్టీ అభ్యర్థులు ఇస్తున్నారు.  ఇక్కడ జై కొట్టిన వారికి  రూ.300, పైగా బిర్యాని ఇస్తున్నట్టు తెలిసింది. వారి కోసం రాను పోను చార్జీలు, తాగునీరు, కూల్‌డ్రింక్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.  పురుషులకైతే మద్యం కూడా ఇస్తున్నారు. దీంతో ఇదే లాభసాటిగా ఉందని భావిస్తున్న కొందరు కూలీలు, గృహిణులు ఉదయం ఓ పార్టీ, సాయంత్రం ఓ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తున్నారు. 


గడిచిన మూడు రోజుల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థికి తన బలం చూపించుకోవడానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అయితే నామినేషన్‌కు వచ్చిన వారంతా పార్టీ కార్యకర్తలు కాదు.. అభ్యర్థి అనుచరులూ కాదు. వారంతా రోజువారీ కూలీలేనని అందరికీ తెలిసిన విషయమే. 


దీంతో అభ్యర్థులకు భారీగా చేతి చమురు వదిలందనే ప్రచారం సాగుతోంది.  గురువారం విజయనగరంలో  వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటా..పోటీగా జనసమీకరణ చేసి బాణ సంచా కాల్చుతూ ఊరేగింపుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లు వేశారు. అయితే వెంట వచ్చిన వారిలో ఎక్కువ మంది విజయనగరం చుట్టు పక్కల నుంచి వచ్చిన గ్రామస్థులేనని, ఉపాధి కూలీలేనని చర్చ నడుస్తోంది.   మొత్తంగా గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ఈ సారి స్థానిక ఎన్నికలు..హంగామా, అట్టహాసాలకు వేదికగా మారింది

Updated Date - 2020-03-13T11:21:18+05:30 IST