టిడ్కో ఇళ్ల విషయంలో గందరగోళం తగదు
ABN , First Publish Date - 2020-12-07T04:40:48+05:30 IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సారిపల్లి, సోనియానగర్లో పేదలకు నిర్మించిన టిడ్కో ఇళ్ల విషయంలో వలంటీర్లు గందరగోళం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు.
విజయనగరం రూరల్: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సారిపల్లి, సోనియానగర్లో పేదలకు నిర్మించిన టిడ్కో ఇళ్ల విషయంలో వలంటీర్లు గందరగోళం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. ఆదివారం తన నివాసంలో మాట్లాడుతూ.. వలంటీర్ల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్లు ఎందుకు కేటాయించరని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లబ్ధిదారులు అప్పటి నిబంధనల ప్రకారం మొత్తం చెల్లించారని, వారి వద్ద సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని తెలిపారు. అర్హులకు అన్యాయం జరిగితే, సహించేది లేదన్నారు. అర్హులకు ఇళ్లు అందే వరకూ తమ పోరాటం ఆగదని ఆమె హెచ్చరించారు.