తల్లిదండ్రుల చెంతకు బాలుడు
ABN , First Publish Date - 2020-05-29T09:52:43+05:30 IST
కొత్తవలస ప్రాంతంలో మతి స్థిమితం లేని బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు.

ఎస్పీ సమక్షంలో అప్పగించిన పోలీసులు
విజయనగరం క్రైం/ కొత్తవలస, మే 28 : కొత్తవలస ప్రాంతంలో మతి స్థిమితం లేని బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కొద్దిరోజు లుగా చెత్తకుప్పలు, పందుల మధ్యే జీవనం సాగిస్తున్న ఆ బాలుడిని ఇటీవల కానిస్టేబుల్ వై.సురేష్ గుర్తించిన విషయం తెలిసిందే. ఆపై బలిఘట్టాంలో హొయినా సంస్థకు అప్పగించారు. అయితే ఈ విషయం పత్రికల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీంతో ఆ బాలుడు సవరపు జగదీష్గా శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలానికి చెందిన వాడిగా తల్లిదండ్రులు అనపయ్య, సావిత్రమ్మ గుర్తించి పోలీలసుకు వివరించారు. వెంటనే పోలీసులు తల్లిదండ్రులను ఎస్పీ రాజకుమారి ఎదుట గురువారం హాజరుపరిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమారుడు పదోతరగతి వరకు చదువుకున్నాడని, 2016లో మతి స్థిమితం కోల్పోయాడని తెలిపారు. 2019 లో జిల్లా అంతటా వెతికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని వివరించారు. ఎట్టకేలకు తమ బిడ్డ ఆచూకీ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈసందర్భంగా ఎస్పీ రాజకుమారి కొత్తవలస కానిస్టేబుల్ సురేష్, సీఐ గోవిందరావును మరోసారి అభినందించారు. ఆ బాలుడికి కొంత నగదు, బిస్కెట్లు ,పండ్ల రసాలను అందజేశారు. బాలుడికి పౌష్టికాహారం ఇవ్వాలని, వైద్య చికిత్స చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.