నిబంధనలు పాటించాల్సిందే : ఎస్పీ

ABN , First Publish Date - 2020-04-03T11:17:08+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు.

నిబంధనలు పాటించాల్సిందే : ఎస్పీ

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 2:   లాక్‌డౌన్‌ నిబంధనలను  ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు.  గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. కోట జంక్షన్‌, రైతు బజారు, అంబేడ్కర్‌ జంక్షన్‌, రాజీవ్‌క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుబజార్లను సందర్శించారు. ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతు బజార్లకు వచ్చేవారికి కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని, ప్ల కార్డులతో అవగాహన కల్పించాలని సూచించారు.


బైక్‌లపై ఇద్దరి కంటే ఎక్కువమంది వెళ్లేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మాస్క్‌లు ధరించకుండా బజారుకు వచ్చేవారికి కౌన్సెలింగు నిర్వహించాలని తెలిపారు. లాక్‌డౌన్‌ పాటించని షాపులు, వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ రామ్మోహనరావు, ఏఎస్పీ శ్రీదేవిరావు, డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎల్‌.మోహనరావు, శేషాద్రి, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు ఎర్రంనాయుడు, శ్రీహరిరాజు,   పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


బైక్‌లపై ప్రచారానికి శ్రీకారం

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు షేక్‌ఖాదర్‌బాషా,  పరుషోత్తం, కాగిత  శ్రీనివాసరావు  బైక్‌లపై ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని గంటస్తంభం వద్ద  ఈ కార్యక్రమాన్ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛందంగా ప్రచారానికి ముందుకొచ్చిన  ఆ యువకులను ఎస్పీ అభినం దించారు.

Updated Date - 2020-04-03T11:17:08+05:30 IST