భౌతికదూరం పాటించేలా చూడండి
ABN , First Publish Date - 2020-05-18T10:51:48+05:30 IST
జిల్లాలో జనసాంద్రత ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడంతో పాటు భౌతికదూరం
ఎస్పీ రాజకుమారి
విజయనగరం క్రైం, మే 17: జిల్లాలో జనసాంద్రత ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజకుమారి పోలీసు అధికారులను ఆదేశించారు. విజయనగరంలోని అంబేడ్కర్ జంక్షన్, దాసన్నపేట రైతు బజారు, మండపం రోడ్డు, రాజీవ్ క్రీడాప్రాంగణం, కన్యకాపరమేశ్వరీ జంక్షన్ ప్రాంతాలను ఆదివారం సందర్శించిన ఆమె పోలీసులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు విధిగా మాస్క్లు ధరించాలని, అమ్మకందారులు తప్పనిసరిగా మాస్క్లు ధరించేలా చూడాలని చెప్పారు.
కరోనా నివారణకు ఏకైక మార్గం వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించడమేనని, మాస్క్లు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా కీలకమన్నారు. మొబైల్ క్యాంటీన్ల వద్ద టిఫిన్లను పార్శిల్ ద్వారా అమ్మేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే, వారి వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.