తోడేస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-03-16T10:05:51+05:30 IST

చంపావతి నదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. డెంకాడ మండలం కేంద్రంలో గల ఇసుక రీచ్‌ నుంచి

తోడేస్తున్నారు..!

చంపావతి నది నుంచి ఇసుక అక్రమ రవాణా

అనుమతులకు మించి తరలింపు

పట్టించుకోని అధికారులు


డెంకాడ, మార్చి 15 : చంపావతి నదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. డెంకాడ మండలం కేంద్రంలో గల ఇసుక రీచ్‌ నుంచి అనుమతులకు మించి ఇసుక రవాణా చేస్తున్నారు. గత నెల రోజులుగా ఈ రీచ్‌ నుంచి వందలాదిగా ట్రాక్టర్లతో ఇసుకను దూర ప్రాంతాలకు తరలిస్తూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.


దీంతో చంపావతి నది పరిసర ప్రాంతాల్లో తాగునీటి వనరులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ తాగునీటి పథకాలు, ఎత్తిపోతల పథకాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇసుక రవాణా కొనసాగితే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అధికారుల సమన్వయ లోపంతో చంపావతి నది నుంచి వేలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలిపోతోంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. 


రాత్రి ఏడు దాటితే మాకు సంబంధం లేదు

చంపావతి నదిలో రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక రవాణా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7  గంటల వరకూ మాత్రమే గ్రామ వలంటీర్లచే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తున్నాం. రాత్రి 7 తరువాత జరిగే ఇసుక తవ్వకాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. 

జగదీష్‌, పంచాయతీ కార్యదర్శి  


చర్యలు తీసుకుంటాం...

 ఎన్నికల విధుల నిర్వహణలో ఉండడం వల్ల ఇసుక రవాణాపై దృష్టి పెట్టలేకపోతున్నాం. రాత్రి వేళ్లల్లో ఇసుక తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం.  

 స్వరూపారాణి, ఎంపీడీవో

Updated Date - 2020-03-16T10:05:51+05:30 IST