విత్తన సరఫరాకు ఆర్టీసీ
ABN , First Publish Date - 2020-05-29T09:48:23+05:30 IST
లాక్డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా ఆర్టీసీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిమిత సంఖ్యలో సర్వీసులను..

ఏపీ సీడ్స్తో ప్రజా రవాణా శాఖ ఒప్పందం
జిల్లావ్యాప్తంగా సేవలు ప్రారంభం
(సాలూరు రూరల్):లాక్డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా ఆర్టీసీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిమిత సంఖ్యలో సర్వీసులను ప్రజా రవాణాకు వినియోగిస్తుండగా.. కార్గో సేవలను విస్తృతం చేస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల రవాణాకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఖరీఫ్నకు వరి విత్తనాల సరఫరాకు ఏపీ సీడ్స్తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం బస్సుల్లో విత్తన రవాణా ప్రారంభమైంది. ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. విత్తనాలను గ్రామాలకు తరలించేందుకు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్నకు జిల్లాలో 62 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అందించేందుకు నిర్ణయించారు.
సాలూరు మండలం జనవరివలస, బొండపల్లి మండలం నెలివాడ, విజయనగరం, బొండపల్లి గిడ్డంగుల్లో వరి విత్తనాలు నిల్వ చేశారు. అక్కడి నుంచి రైతుభరోసా కేంద్రాలకు విత్తనాలు తరలించేందుకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నాలుగు పాయింట్ల నుంచి సకాలంలో విత్తన సరఫరాకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తోంది. జనవరివలస ఏపీ సీడ్స్ నుంచి విత్తన తరలింపు ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభించారు. జిల్లాలో 62 వేల క్వింటాళ్లు విత్తనాల్లో సాధ్యమైనంత వరకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించనున్నారు. రోజుకు 10 నుంచి 15 బస్సుల్లో విత్తనాలు తరలిస్తున్నామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ బాలకృష్ణ తెలిపారు.