అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ..

ABN , First Publish Date - 2020-11-28T05:00:23+05:30 IST

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్వాసితులైన అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.

అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ..
నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే బడ్డుకొండ, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు

ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

భోగాపురం, నవంబరు 27: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్వాసితులైన అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. కవులవాడ పంచాయతీ మరాడపాలెం గ్రామంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటులో గృహాలు కోల్పోతున్న వారందరికీ లాటరీ ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు తహసీల్దార్‌ డి.రాజేశ్వరరావు ఆధ్వర్యం లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వైసీపీ మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తదితర విషయాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేలా ఎమ్మెల్యే, ఎంపీ కృషి చేయాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ రైతులకు, నిర్వాసితుల కు అన్యాయం జరగకుండా చూసేందుకు అన్నివిధాలా కృషి చేస్తామన్నారు. చదువుకున్నవారికి ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు  కృషి చేస్తామని చెప్పారు. అనంతరం 223 కుటుంబాలకు సంబంధించి లాటరీ తీసి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాయకుడు దాట్ల శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, సుందర గోవిందరావు, తహసీల్దార్‌ డి.రాజేశ్వరరావు, ఎంపీడీవో డి.బంగారయ్య, ఆర్‌ఐ రవికిరణ్‌, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T05:00:23+05:30 IST