వృద్ధులను గౌరవిద్దాం!
ABN , First Publish Date - 2020-02-12T10:36:29+05:30 IST
‘వృద్ధులను గౌరవించాలని, అది మన సంస్కృతిలో ఒక భాగం’ అని జేసీ-2 ఆర్.కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలో వారి సంక్షేమానికి అన్ని
![వృద్ధులను గౌరవిద్దాం!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జేసీ-2 కూర్మనాథ్
పూల్బాగ్, ఫిబ్రవరి 11: ‘వృద్ధులను గౌరవించాలని, అది మన సంస్కృతిలో ఒక భాగం’ అని జేసీ-2 ఆర్.కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలో వారి సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం వయోవృద్ధుల సంక్షేమ కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ఏసమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొన్నేళ్లుగా సామాజిక సంబంధాల్లో వస్తున్న మార్పుల కారణంగా ఇంటి పెద్దలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పెద్దలకు ఎంతో గౌరవం ఇచ్చే మన దేశంలో కూడా వృద్ధాశ్రమాలు పెరగడం శుభ పరిణామం కాదని తెలిపారు. అసలు వృద్ధాశ్రమాలనేవి మన సంస్కృతిలో లేవని, ఇటీవల వచ్చిన సామాజిక మార్పుల వల్లే వీటి అవసరం ఏర్పడుతోందని చెప్పారు. వాటివల్లే వృద్ధుల పరిరక్షణ, హక్కుల కోసం 2007లో చట్టం చేయాల్సి వచ్చిందన్నారు.
చిన్నప్పుడే పిల్లలను ఇంటికి దూరంగా కార్పొరేట్ స్కూళ్లలో వేయడం వల్ల ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అలాంటివారు పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదని చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా తమ దృక్పథాన్ని మార్చుకోవల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.గోవర్దనరావు, అదనపు డీఎంహెచ్వో డాక్టార్ బాలమురళీ కృష్ణ, ఏపీడీఆర్సీ ప్రాజెక్టె ఆఫీసర్ విజయకుమార్ , వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు చదలవాడ ప్రసాద్ , బీహెచ్వీ రత్నం, కేపీ ఈశ్వర్, ఎన్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.