రూ.50 కోట్లతో రోడ్లకు మరమ్మతులు
ABN , First Publish Date - 2020-11-26T05:15:47+05:30 IST
జిల్లాలో రూ.50 కోట్లతో రహదారుల మరమ్మతులకు ప్రతి పాదనలు పంపినట్టు ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (రెగ్యులర్) వీకే విజయశ్రీ తెలిపారు.
రామభద్రపురం, నవంబరు 25:
జిల్లాలో రూ.50 కోట్లతో రహదారుల మరమ్మతులకు ప్రతి పాదనలు పంపినట్టు ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (రెగ్యులర్) వీకే విజయశ్రీ తెలిపారు. మండల కేంద్రంలోని సచివాలయం- 2లో ఆమె విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటికే చాలా రోడ్లకు ప్యాచ్ వర్కులు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో న్యూ డవలప్మెంట్ బ్యాంకు పథకంలో ఏడు రోడ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు అంచనాలు తయారుచేసి ప్రతిపాదనలు పంపామని, వీటిలో సాలూరు, మక్కువ, తోటపల్లి, చీపురుపల్లి ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. గతప్రభుత్వ హయాంలో మంజూరైన సీతానగరం, పారాది బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మురిగిపోవడంతో కొత్తగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ స్పెషలాఫీసర్ విజయశ్రీ కోరారు. మండల కేంద్రంలో ఉన్న సచివాలయం-1,2లను బుధవారం ఆమె తనిఖీ చేశారు.