నిబంధనల మేరకు సిఫారసు
ABN , First Publish Date - 2020-12-04T05:09:17+05:30 IST
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో ప్రవేశం పొందేందుకు నిబంధనల మేరకు సిఫార్సు చేస్తామని ఉల్లిభద్ర డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బి.ప్రసన్నకుమార్ తెలిపారు.

గరుగుబిల్లి, డిసెంబరు 3 : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో ప్రవేశం పొందేందుకు నిబంధనల మేరకు సిఫార్సు చేస్తామని ఉల్లిభద్ర డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బి.ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం కళాశాలలో 2020-21 సంవత్సరంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీలో సీట్లు పొందేందుకు రైతు కోటాలో ప్రవేశానికి ధ్రువపత్రాలను పరిశీలించారు. పరిశీలన అధికారిగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎస్ విజయపద్మను నియమించారన్నారు. రాష్ట్రంలోని 32 కేంద్రాల్లో పరిశీలనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, విజయనగరం జిల్లాకు సంబంధించి ఉద్యాన కళాశాలను ఎంపిక చేసిందన్నారు. రైతు కోటాలో సీటును పొందేందుకు విధిగా నాలుగేళ్ల పాటు చదివి ఉండాలని, దీనికి సంబంధించి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులచే ధ్రువీకరణ పత్రం, తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రంతో పాటు పట్టాదార్ పాస్ పుస్తకం నకళ్లు అందించాలన్నారు. ఈ పత్రాల పరిశీలన ఈ నెల 5వ తేదీ వరకు కళాశాలలో ఉంటుందన్నారు. పరిశీలన తదుపరి 6 నుంచి 8వ తేదీ వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక ఉంటుందన్నారు.