మా ఇంటికి వస్తేనే పింఛన్‌..

ABN , First Publish Date - 2020-12-02T05:26:19+05:30 IST

గ్రామ వలంటీర్లు సాధారణంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ వల్లూరు పంచాయతీ బొడ్డపేట వలంటీరు తీరు వేరేలా ఉంది.

మా ఇంటికి వస్తేనే పింఛన్‌..
వలంటీర్‌ను నిలదీస్తున్న పింఛన్‌దారులు

  ఇదీ బొడ్డపేట వలంటీరు తీరు..

నెల్లిమర్ల, డిసెంబరు1: గ్రామ వలంటీర్లు సాధారణంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ వల్లూరు పంచాయతీ బొడ్డపేట వలంటీరు తీరు వేరేలా ఉంది. ‘మీకు పింఛను సొమ్ము కావాలా.. వస్తే మా ఇంటికి రండి, లేదంటే గ్రామ వైసీపీ నేత ఇంటికి రండి.. కాదు కూడదు అంటే పింఛన్‌ కట్‌’ అంటూ లబ్ధిదారులను అవస్థలకు గురి చేస్తున్నాడు. బొడ్డపేట గ్రామంలో సుమారు వందమంది పింఛన్‌దారులు ఉన్నారు.  గ్రామ వలంటీరు పంచాయతీ కేంద్రమైన వల్లూరులో ఉంటున్నారు. బొడ్డపేట గ్రామానికి వల్లూరు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగళవారం పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అయితే పింఛన్ల సొమ్ము కావాలంటే వల్లూరులో తమ ఇంటికి గానీ, వైసీపీ నేత ఇంటికి గానీ రావాలని సదరు వలంటీరు చెప్పడంతో లబ్ధిదారులంతా అవాక్కయ్యారు. వారంతా వలంటీరు వద్దకు వెళ్లి నిలదీశారు. రెండు కిలోమీటర్లు దూరం వచ్చి పింఛను తీసుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తుందని, తమ ఇళ్లకే వచ్చి పింఛన్లు అందచేయాలని వారు కోరారు. 

ఇంటికే పింఛన్‌ అందేలా చూస్తాం

వలంటీరు ఇంటింటికి వెళ్లి పించన్లు పంపిణీ చేయాలి. బొడ్డపేటలో అందుకు విరుద్ధంగా జరిగినట్టయితే సంబంధత వలంటీరుపై చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇంటింటికీ పింఛను అందేలా చూస్తాం.

 - రాజ్‌కుమార్‌, ఎంపీడీవో   

 

 

Updated Date - 2020-12-02T05:26:19+05:30 IST