కదంతొక్కిన కార్మికులు
ABN , First Publish Date - 2020-11-27T03:49:31+05:30 IST
విజయనగరంలో కార్మికులు గురువారం కదంతొక్కారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎనటీయూసీ కార్మిక విభాగాల సభ్యులు భారీగా హాజరయ్యారు.

సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ నిరసన ర్యాలీ
కేంద్రం తీరుపై కార్మిక సంఘ నేతల ఆగ్రహం
దాసన్నపేట, నవంబరు 26: విజయనగరంలో కార్మికులు గురువారం కదంతొక్కారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎనటీయూసీ కార్మిక విభాగాల సభ్యులు భారీగా హాజరయ్యారు. కోట జంక్షనలో ప్రారంభమైన నిరసన ర్యాలీ కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎంజీ రోడ్డు మీదుగా స్టేట్బ్యాంక్ మెయిన బ్రాంచ వరకూ సాగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణంరాజు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది కార్మికుల పొట్ట కొడుతున్న ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. వ్యతిరేక విధానాలు వీడే వరకూ కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న కార్మిక చట్టాల విషయంలో బీజెపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహారిస్తోందన్నారు. ఆ చట్టాలు రద్దుచేసి ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసిందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులు ఎం.శ్రీనివాసరావు, టీవీ రమణ, బుగత అశోక్, ఒమ్మి రమణ, రంగరాజు, జీవన, రెడ్డి శంకరరావు, రమణమ్మ, జగన తదితరులు పాల్గొన్నారు.