ఉత్తరాంధ్రకు అన్యాయం
ABN , First Publish Date - 2020-11-14T04:34:15+05:30 IST
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో పాటు తోటపల్లి పనులను ఐదేళ్లపాటు నిలిపేయాలన్న ప్రభుత్వం నిర్ణయాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరగనుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గద్దె బాబూరావు తెలిపారు.
చీపురుపల్లి:
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో పాటు తోటపల్లి పనులను ఐదేళ్లపాటు నిలిపేయాలన్న ప్రభుత్వం నిర్ణయాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరగనుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గద్దె బాబూరావు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కూడా నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే విశాఖ ప్రజలు తాగు నీటికి కటకటలాడు తున్నారని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులు మరో ఐదేళ్లపాటు రద్దు చేస్తూ ప్రభుత్వం చేతులెత్తేయడం వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులకు తీవ్ర నష్టం చేకూరనుందన్నారు. ఇప్పటికే పిల్ల కాలువలు, స్లూయీస్ నిర్మాణాలు జరగక, రైతులు సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతి నిధులు తక్షణమే దీనిపై స్పందించాలని గద్దె కోరారు. సమావేశంలో పార్టీ నాయకుడు శంకర్లాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.